IND Vs PAK: పాక్‌తో మ్యాచ్‌.. పోరాడి ఓడిన భారత్‌ | Under-19 Asia Cup: Pakistan Won By 2 Wickets Vs India | Sakshi
Sakshi News home page

Under-19 Asia Cup IND vs PAK: పాక్‌తో మ్యాచ్‌.. పోరాడి ఓడిన భారత్‌

Dec 25 2021 7:40 PM | Updated on Dec 25 2021 8:00 PM

Under-19 Asia Cup:  Pakistan Won By 2 Wickets Vs India - Sakshi

అండర్‌-19 ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా పోరాడి ఓడిపోయింది. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయాన్ని అందుకున్న టీమిండియా ఆ మ్యాజిక్‌కు పాక్‌పై రిపీట్‌ చేయలేకపోయింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 49 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో టీమిండియా పరుగులు చేయడంలో విఫలమైంది.

ఒక దశలో 96 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో 150 మార్క్‌ చేరుతుందా అన్న అనుమానం కూడా కలిగింది. టాపార్డర్‌, మిడిలార్డర్‌ విఫలమైన చోట లోయర్‌ ఆర్డర్‌లో వికెట్‌ కీపర్‌ ఆరాధ్య యాదవ్‌ అర్థసెంచరీ(83 బంతుల్లో 50 పరుగులు), కుషాల్‌ తంబే 32, రాజ్‌వర్దన్‌ హంగార్గేకర్‌ 33 పరుగులు సాధించడంతో టీమిండియా 237 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. పాక్‌ బౌలర్లలో జీషన్‌ జమీర్‌ 5 వికెట్లు తీయగా, అవైస్‌ అలీ 2 వికెట్లు తీశాడు.

అనంతరం బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్‌ బ్యాటింగ్‌లో ముహమ్మద్‌ షెహజాద్‌ 81 పరుగులతో మెరవగా.. ఇర్ఫాన్‌ ఖాన్‌ 32, రిజ్వాన్‌ మెహమూద్‌ 29 పరుగులు చేశారు.  భారత బౌలర్లలో రాజ్‌ భవా 4 వికెట్లతో మెరిశాడు. భారత బౌలర్లు పాకిస్తాన్‌ బ్యాటర్లను తమ బౌలింగ్‌తో ఇబ్బందిపెట్టినప్పటికి చేధించాల్సిన స్కోరు ఎక్కువగా లేకపోవడం పాక్‌కు కలిసివచ్చింది. ఇక టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌ను అఫ్గానిస్తాన్‌తో ఆడనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement