
ఐపీఎల్-2025 క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్కు ఘోర పరాభవం ఎదురైంది. గురువారం ముల్లాన్పూర్ వేదికగా ఆర్సీబీతో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లు విల్లవిల్లాడారు.
దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేవలం 101 పరుగులకే ఆలౌటైంది. ఆ లక్ష్యాన్ని ఆర్సీబీ పది ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో దారుణ ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ విమర్శల వర్షం కురిపించారు.
పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేయడం నేర్చుకో అయ్యర్ అంటూ ఆయన మండిపడ్డారు. కాగా కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన అయ్యర్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. బాధ్యతాయుతంగా ఆడాల్సిన శ్రేయస్.. హాజిల్వుడ్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి వికెట్ కీపర్కు దొరికిపోయాడు. శ్రేయస్ కేవలం రెండు 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు.
అదేవిధంగా టీ20ల్లో అయ్యర్పై హాజిల్వుడ్కు మంచి రికార్డు ఉంది. ఈ ఆసీస్ స్పీడ్ స్టార్ అయ్యర్ను నాలుగు సార్లు టీ20ల్లో ఔట్ చేశాడు. అయినప్పటికి అతడి బౌలింగ్లో నిర్లక్ష్యంగా షాట్ ఆడి అయ్యర్ ఔటయ్యాడని మూడీ వంటి దిగ్గజాలు విమర్శలు గుప్పిస్తున్నారు.
"శ్రేయస్ అయ్యర్ పరిస్థితులకు తగ్గట్టు ఏ మాత్రం ఆడలేదు. కెప్టెన్గా తన బాధ్యతను కూడా మర్చిపోయాడు. గతంలో చాలా సార్లు తనను హాజిల్వుడ్ ఔట్ చేశాడని అయ్యర్కు బాగా తెలుసు. అయినప్పటికి జాగ్రత్తగా ఆడకుండా ఈగోకి పోయి తన వికెట్ను సమర్పించుకున్నాడు.
కొన్నిసార్లు మన అహాన్ని జేబులో పెట్టుకుని ముందుకు సాగాలి. అప్పుడే విజయాలు సాధించగలము" అని మూడీ పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది సీజన్ అసాంతం తన కెప్టెన్సీ, బ్యాటింగ్తో ఆకట్టుకున్న శ్రేయస్.. కీలకమైన మ్యాచ్లో మాత్రం విఫలమై విమర్శలను ఎదుర్కొంటున్నాడు.