PC: BCCI X
భారత టీ20 కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన తర్వాత శ్రేయస్ అయ్యర్కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. యూకే పర్యటనలో భాగంగా అతడి సారథ్యంలో పసికూన ఐర్లాండ్ చేతిలో టీమిండియా 2-0తో వైట్వాష్కు గురైంది.
అనంతరం ఇంగ్లండ్ గడ్డ మీద 4-0తో క్లీన్స్వీప్ అయింది. ఈ సిరీస్లో ఓ మ్యాచ్ వర్షం వల్ల రద్దైపోయింది. దీంతో కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి ఏడు మ్యాచ్లలోనూ శ్రేయస్ అయ్యర్కు గెలుపన్నదే లేకుండా పోయింది. ఈ క్రమంలో జింబాబ్వే గడ్డ మీద తొలి మ్యాచ్ సందర్భంగా ఎట్టకేలకు శ్రేయస్ సేన విజయాల ఖాతా తెరిచింది.
సమిష్టిగా రాణించి ఆతిథ్య జింబాబ్వే జట్టుపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా వరుస పరాభవాల తర్వాత శ్రేయస్ తొలిసారి గెలుపు రుచిచూశాడు. అయితే, జింబాబ్వేపై విజయాన్ని కూడా ఇంతలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన పనిలేదంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.
మిగిలిపోయిందైనా.. అది విందు భోజనం లాంటిదే!
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ శ్రేయస్ అయ్యర్కు మద్దతుగా నిలిచాడు. ‘‘జింబాబ్వే మీద విజయాన్ని గొప్పగా భావించవద్దని చాలా మంది అంటున్నారు. అయితే.. టీ20 ప్రపంచకప్ చాంపియన్గా నిలిచిన తర్వాత టీమిండియా టీ20మ్యాచ్లో విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూసింది.
చాన్నాళ్ల ఆకలి తర్వాత దక్కిన గెలుపు ఇది. కాబట్టి ఇది మిగిలిపోయిందే అయినా.. పెళ్లి భోజనం లాంటిదే. శ్రేయస్ అయ్యర్కు కాస్త ఊరట లభించింది. అతడి కెప్టెన్సీ ఆరంభంలోనే టీమిండియా ఘోర పరాజయాలు చవిచూసింది.
కాబట్టి ఇప్పుడు జింబాబ్వే మీద గెలిచినా సరే.. అది విజయమే. ఇప్పుడు ఇదే అతడికి బూస్ట్’’ అని సదగోపన్ రమేశ్ పేర్కొన్నాడు. అదే విధంగా.. జింబాబ్వే టూర్లో గౌతం గంభీర్కు బదులు తాత్కాలిక హెడ్కోచ్గా వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్పై రమేశ్ ప్రశంసలు కురిపించాడు.
వీవీఎస్ లక్ష్మణ్పై ప్రశంసలు
‘‘ఈ విజయంలో వీవీఎస్ లక్ష్మణ్దే సింహభాగం. అతడు ఎప్పుడు కోచ్గా వ్యవహరించినా సరే.. అప్పుడు టీమిండియా తప్పక విజయాలు సాధిస్తుంది. అతడి మార్గదర్శనంలో టీమిండియా ప్రత్యర్థులను దాదాపుగా అన్ని సిరీస్లలోనూ వైట్వాష్ చేసింది.
టీమిండియా వైట్వాష్లకు గురైన తర్వాత కూడా అతడు ఇలాంటి ఫలితాలు రాబట్టాడు. వరుస పరాజయాల తర్వాత ఇప్పుడు జింబాబ్వేతో తొలి మ్యాచ్లోనూ టీమిండియా గెలిచింది’’ అని రమేశ్ వీవీఎస్ లక్ష్మణ్ను ప్రశంసించాడు.
కాగా జింబాబ్వేతో మూడు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా గురువారం నాటి తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి.. 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య శని, ఆది వారాల్లో మిగిలిన రెండు మ్యాచ్లు జరుగుతాయి. ఇందుకు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక.


