Team India Wicket Keeper KS Bharat Meets AP CM YS Jagan - Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన టీమిండియా క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌

Published Thu, Jun 15 2023 7:25 PM

Team India Wicket Keeper KS Bharat Meets AP CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: టీమిండియా క్రికెటర్‌, భారత టెస్ట్‌ జట్టు సభ్యుడు (వికెట్‌ కీపర్‌) కోన శ్రీకర్‌ భరత్‌ ఇవాళ (జూన్‌ 15) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా భరత్‌.. టీమిండియా క్రికెటర్లు ఆటోగ్రాఫ్‌లు చేసిన జెర్సీని సీఎంకు బహుకరించారు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించినందుకు గాను సీఎం జగన్‌ భరత్‌ను అభినందించారు.

ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం భరత్‌ మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత ఏపీ నుంచి టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన మొదటి క్రికెటర్‌ను నేనే కావడం చాలా గర్వంగా ఉందని అన్నాడు. ఈ విషయాన్ని సీఎంతో షేర్‌ చేసుకోగా, సంతోషం వ్యక్తం చేశారని తెలిపాడు. తన లాంటి ఎంతో మంది యువ క్రికెటర్లకు సీఎం జగన్‌ స్పూర్తిగా నిలుస్తారని చెప్పుకొచ్చాడు.

దేశం గర్వపడేలా, మన రాష్ట్ర పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని సీఎం సూచించారని తెలిపాడు. ఏపీలో మౌలిక వసతులు బాగా పెరుగుతున్నాయని, స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ చాలా బాగుందని పేర్కొన్నాడు. క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం చాలా బాగుందని, ఇలాంటి ప్రోత్సాహం లభించడం వల్ల నాలాంటి చాలామంది క్రీడాకారులు వెలుగులోకి వస్తారని చెప్పుకొచ్చాడు. కాగా, సీఎం​ జగన్‌తో జరిగిన సమావేశంలో కేఎస్‌ భరత్‌తో పాటు అతని తల్లిదండ్రులు మంగాదేవి, శ్రీనివాసరావు, కోచ్‌ క్రిష్ణారావు, ఎంపీ మిథున్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement