ఎన్నాళ్లకెన్నాళ్లకు.. బౌలింగ్‌లో మెరిసిన టీమిండియా స్టార్‌! | Team India Star-Umesh Yadav Bowling Viral In-Vidarbha Premier League 2026 | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. బౌలింగ్‌లో మెరిసిన టీమిండియా స్టార్‌!

Jun 3 2026 6:04 PM | Updated on Jun 3 2026 6:21 PM

Team India Star-Umesh Yadav Bowling Viral In-Vidarbha Premier League 2026

టీమిండియా వెట‌ర‌న్ క్రికెట‌ర్ ఉమేశ్ యాద‌వ్ చాన్నాళ్ల త‌ర్వాత త‌న బౌలింగ్‌తో ద‌ర్శ‌న‌మిచ్చాడు. భార‌త జ‌ట్టులో ఎప్పుడో చోటు కోల్పోయిన ఉమేశ్ ప్ర‌స్తుతం విద‌ర్భ ప్రీమియ‌ర్ లీగ్ ఆడుతూ బిజీగా గ‌డుపుతున్నాడు. ఈ లీగ్‌లో నాగ్‌పూర్ హీరోస్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఉమేశ్ యాద‌వ్ మంగ‌ళ‌వారం ఇండియా వారియ‌ర్స్‌తో మ్యాచ్ ఆడాడు. 

ఈ మ్యాచ్‌లో ఉమేశ్ యాద‌వ్ 3 ఓవ‌ర్ల‌లో 41 ప‌రుగులిచ్చి ఒక్క వికెట్ మాత్ర‌మే ప‌డ‌గొట్టాడు. ఈ నేప‌థ్యంలో ఉమేశ్ యాద‌వ్ బౌలింగ్ వీడియోనూ ఒక అభిమాని ఎక్స్ వేదిక‌గా పంచుకున్నాడు. 'ఎన్ని రోజుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చావ‌య్యా.. నీ బౌలింగ్ చూసి కొన్నేళ్ల‌యింది.. థాంక్యూ ఉమేశ్' అంటూ కామెంట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

2010లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఉమేశ్ యాద‌వ్ టీమిండియా త‌ర‌ఫున 57 టెస్టుల్లో 170 వికెట్లు, 75 వ‌న్డేల్లో 106 వికెట్లు, 9 టీ20ల్లో 12 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీల త‌ర‌ఫున ఆడిన వైభ‌వ్ మొత్తంగా 148 మ్యాచ్‌ల్లో 144 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ధోని సార‌థ్యంలో 2013 చాంపియ‌న్స్ ట్రోఫీ నెగ్గిన టీమిండియాలో ఉమేశ్ యాద‌వ్ స‌భ్యుడిగా ఉన్నాడు. 

2015 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమిండియా త‌ర‌ఫున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా ఉమేశ్ యాద‌వ్‌ నిలిచాడు. 2019లో సౌతాఫ్రికాతో జ‌రిగిన టెస్టు మ్యాచ్‌లో 310 స్ట్రైక్‌రేట్‌తో 10 బంతుల్లోనే 31 ప‌రుగులు చేయ‌డం ఇప్ప‌టికీ ఒక రికార్డుగా మిగిలిపోయింది. 

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే ఉమేశ్ యాద‌వ్ ప్రాతినిధ్యం వ‌హించిన నాగ్‌పూర్ హీరోస్‌పై ఇండియ‌న్ వారియ‌ర్స్‌ 33 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వారియ‌ర్స్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 261 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ శ‌ర్మ (19 బంతుల్లోనే 63 నాటౌట్‌), శుభ‌మ్ దూబే (33 బంతుల్లో 74 నాటౌట్‌) మెరిశారు. 

అనంత‌రం నాగ్‌పూర్ హీరోస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి ఓడిపోయింది. సిద్ధేశ్ వత్ (78) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇండియా వారియర్స్ బౌలర్లలో ప్రఫుల్ హింగే, దర్శన్ నల్కండే, రాహుల్ డోంగర్‌వార్‌, గుర్దీప్‌సింగ్‌లు తలా రెండు వికెట్లు తీశారు. 

చదవండి: వైభవ్‌ సూర్యవంశీపై ప‌రిశోధ‌న‌లు!

Advertisement
 
Advertisement
Advertisement