2024 టీ20 వరల్డ్కప్లో పాల్గొనే టీమిండియా కోసం స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ఓ ప్రత్యేక ప్రోమో వీడియో రిలీజ్ చేసింది. రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో రోహిత్, కోహ్లి, సూర్యకుమార్, పాండ్యా, జడేజాలను చూపించిన వైనం అత్యద్భుతంగా ఉంది.
ఇది చూస్తే భారత క్రికెట్ అభిమానులకు గూస్ బంప్స్ రావడం ఖాయం. బ్యాక్ గ్రౌండ్లో వందేమాతర గీతం వీడియోని రక్తి కట్టించింది. ఆఖర్లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి సెల్యూట్ చేస్తున్న క్లిప్ అభిమానుల్లో జోష్ నింపుతుంది. "వరల్డ్కప్ కోసం టీమిండియా సిద్ధం" అని అర్దం వచ్చేలా ఈ వీడియాకి క్యాప్షన్ ఉంది.
కాగా, యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా ఈ ఏడాది జూన్ 1 నుంచి టీ20 వరల్డ్కప్ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ దాదాపు నెల రోజులపాటు సాగుతుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి పోటీపడతాయి. గ్రూప్-ఏలో భారత్తో పాటు కెనడా, పాకిస్థాన్, యూఎస్ఏ, ఐర్లాండ్ ఉన్నాయి. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరం (భారత్-పాక్ మ్యాచ్) జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరుగనుంది.