PC: BCCI/X
టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే అభిషేక్ శర్మ కడుపు నొప్పితో బాధపడుతుండగా.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ సైతం గాయపడ్డాడు. నమీబియాతో మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సెషన్లో భాగంగా ఈ లెఫ్టాండర్ బ్యాటర్ కాలి బొటనవేలికి గాయమైనట్లు సమాచారం.
పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) బౌలింగ్లో యార్కర్ను ఎదుర్కొనేందుకు ఇషాన్ సిద్ధపడగా.. బంతి బలంగా అతడి బొటనవేలికి తగింది. దీంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే నెట్ సెషన్ నుంచి బయటకు వెళ్లిపోయిన ఇషాన్ కిషన్ (Ishan Kishan).. కాసేపటి తర్వాత తిరిగి వచ్చాడు.
గాయం గనుక తిరగబెడితే
ప్రస్తుతం అతడు బాగానే ఉన్నట్లు సమాచారం. అయితే, గాయం గనుక తిరగబెడితే ఇషాన్ మ్యాచ్కు అందుబాటులో ఉండటం కష్టమే. కాగా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ గత మూడు రోజులుగా కడుపు నొప్పి సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే.
అభిషేక్ డిశ్చార్జ్ అయినా..
ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరిన అభిషేక్ బుధవారం డిశ్చార్జ్ అయినట్లు మరో బ్యాటర్ తిలక్ వర్మ వెల్లడించాడు. అతడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపాడు. అయితే, నమీబియాతో మ్యాచ్ ఆడతాడా? లేదా? అన్న అంశం మీద మాత్రం తిలక్ స్పష్టతనివ్వలేదు.
ఇంతలో ఇషాన్ కిషన్కు కూడా స్వల్ప గాయం కావడంతో టీమిండియా శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే, కాసేపటికే పరిస్థితి బాగుపడటంతో ఊపిరి పీల్చుకుంది.
ఇప్పటికే రాణా అవుట్
కాగా యువ పేసర్ హర్షిత్ రాణా గాయం వల్ల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో సీనియర్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు.
మరోవైపు.. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం వల్ల అమెరికాతో తొలి మ్యాచ్కు దూరమయ్యాడు. అయితే, ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించి నమీబియాతో మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు.
ఇక తీవ్రమైన జ్వరం కారణంగా అమెరికాతో మ్యాచ్ ఆడలేకపోయిన బుమ్రా సైతం తిరిగి వచ్చాడు. ఇదిలా ఉంటే.. అభిషేక్ శర్మ కోలుకోనట్లయితే ఇషాన్తో కలిసి సంజూ శాంసన్ భారత ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది.
కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీ గ్రూప్-‘ఎ’లో భాగంగా అమెరికాపై గెలిచిన టీమిండియా... తదుపరి గురువారం నమీబియాతో తలపడనుంది. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక.
చదవండి: IND vs NAM: మరో కూనతో పోరు


