టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ లల్లన్టాప్కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన మాటలతో సంచలనాల పరంపరకు తెరతీశాడు. శుక్రవారం మాజీ స్పిన్నర్ హర్భజన్కు సవాల్ విసిరిన శ్రీశాంత్, ఆ తర్వాత గంభీర్ కోచ్గా పనికిరాడని, అతడి స్థానంలో మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనిని మెంటార్ లేదా కోచ్గా ఎంపిక చేయాలని పేర్కొన్నాడు. తాజాగా గంభీర్పై మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు.
2023లో లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ సందర్భంగా గంభీర్ తనను దేశద్రోహి అని తిట్టినట్లు శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. లల్లన్టాప్కు ఇచ్చిన ఇంటర్య్వూలోనే శ్రీశాంత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. శ్రీశాంత్ మాట్లాడుతూ.. ‘2023 లెజెండ్ లీగ్ టోర్నీలో మేమిద్దరం ప్రత్యర్థులుగా ఆడాము. నేను వేసిన తొలి బంతినే గంభీర్ ఫ్లిక్ షాట్ ఆడేందుకు ముందుకు వచ్చాడు.
అయితే అతడి గేమ్ ఏంటో నాకు తెలుసు. ఆ వెంటనే నేను బౌన్సర్ను సంధించాను. ఆ సమయంలోనే గంభీర్ నన్ను ఒక ఫిక్సర్గా పిలిచాడు. దీంతో గంభీర్ దగ్గరకు వచ్చి భయ్యా నువ్వు బాగానే ఉన్నావా? అని అడిగాను. ఎందుకంటే నేను వేసిన బౌన్సర్ అతడికి తాకింది. కానీ గంభీర్ మాత్రం ఒక అసభ్య పదజాలం వాడడంతో పాటు మళ్లీ ఒకసారి ఫిక్సర్, దేశద్రోహి అని పిలిచాడు’ అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.
2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన టీమిండియా జట్టులో గంభీర్,శ్రీశాంత్ సభ్యులుగా ఉండడం విశేషం. అయితే క్రికెట్ నుంచి దూరమైన తర్వాత ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో శ్రీశాంత్పై నిషేధం పడిన సమయంలో గంభీర్ అతడిని ఉద్దేశించి పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
అప్పటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఏడేళ్ల నిషేధం తర్వాత 2020లో శ్రీశాంత్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆకట్టుకోలేక ఆటకు వీడ్కోలు పలికాడు. ఆటకు గుడ్బై చెప్పిన గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా వచ్చాడు. అతడి పర్యవేక్షణలో టీమిండియా 2025 చాంపియన్స్ ట్రోఫీతో పాటు 2026 టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది.


