
ఇంగ్లండ్ పర్యటనను భారత మహిళల జట్టు ఘనంగా ఆరంభించింది. శనివారం నాటింగ్హామ్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ఇంగ్లండ్ను 97 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఉమెన్ ఇన్ బ్లూ ఆధిక్యంలో దూసుకెళ్లింది.
211 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ అమ్మాయిలు చేధించలేకపోయారు. భారత బౌలర్ల దాటికి ఇంగ్లండ్ కేవలం 113 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కడప అమ్మాయి శ్రీచరణీ నాలుగు వికెట్లతో సత్తాచాటింది. ఆమెతో పాటు దీప్తీ శర్మ, రాధా యాదవ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ స్కివర్ బ్రంట్(66) టాప్ స్కోరర్గా నిలిచింది.
చరిత్ర సృష్టించిన మంధాన
ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన అద్బుతమైన సెంచరీతో చెలరేగింది. ఆది నుంచి దూకుడుగా ఆడిన మంధాన.. కేవలం 51 బంతుల్లోనే తన తొలి టీ20 సెంచరీ మార్క్ను అందుకుంది. స్మృతి మొత్తంగా 62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేసింది. ఈ క్రమంలో మంధాన పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.
మూడు ఫార్మాట్లలో శతకాలు చేసిన తొలి భారత మహిళా ప్లేయర్గా స్మృతి చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఏ ఇండియా ఉమెన్ ప్లేయర్ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.
అదేవిధంగా ఇంగ్లండ్పై అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన మహిళ క్రికెటర్గా ఆసీస్ సూపర్ స్టార్ బెత్ మూనీ రికార్డును మంధాన సమం చేసింది. ఆల్ఫార్మాట్లో మంధాన ఇప్పటివరకు 8 సార్లు ఏభైకి పైగా పరుగులు చేయగా.. మూనీ కూడా సరిగ్గా 8 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్ సాధించింది.

ఇంగ్లండ్పై అత్యధిక 50 ప్లస్ స్కోర్లు:
స్మృతి మంధాన: 8
బెత్ మూనీ: 8
మెగ్ లానింగ్: 5
డియాండ్రా డాటిన్: 3
హేలీ మాథ్యూస్: 3
డేన్ వాన్ నీక్: 3
చదవండి: అరంగేట్రంలోనే సెంచరీ.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా టీనేజర్