ఏంజెలో మాథ్యూస్‌కు ఘనంగా వీడ్కోలు.. కోహ్లి ఇలాంటి గౌరవానికి అర్హుడు కాడా..? | SL VS BAN 1st Test: Beautiful Farewell For Angelo Mathews, Fans Ask Why Did Kohli Didn't Get This Type | Sakshi
Sakshi News home page

ఏంజెలో మాథ్యూస్‌కు ఘనంగా వీడ్కోలు.. కోహ్లి ఇలాంటి గౌరవానికి అర్హుడు కాడా..?

Jun 17 2025 10:52 AM | Updated on Jun 17 2025 11:03 AM

SL VS BAN 1st Test: Beautiful Farewell For Angelo Mathews, Fans Ask Why Did Kohli Didn't Get This Type

శ్రీలంక క్రికెట్‌ దిగ్గజాల్లో​ ఒకరైన ఏంజెలో మాథ్యూస్‌ కెరీర్‌లో తన చిట్టచివరి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడేందుకు బరిలోకి దిగాడు. ఇవాల్టి నుంచి (జూన్‌ 17) శ్రీలంక స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతుంది. ఈ మ్యాచ్‌ కెరీర్‌లో తనకు చివరిదని మాథ్యూస్‌ ఇదివరకే ప్రకటించాడు. 

మాథ్యూస్‌ సహచరుల నుంచి గార్డ్ ఆఫ్ ఆనర్ పొందాడు. ఆ సమయంలో మాథ్యూస్‌ ముఖంలో చిరునవ్వులు విరబూసాయి. లంక క్రికెట్‌కు ఎంతో చేసిన మాథ్యూస్‌కు చివరి టెస్ట్‌కు ముందు ఘనమైన వీడ్కోలు లభించింది. ఇది చూసి భారత క్రికెట్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి అభిమానులు బీసీసీఐపై మండిపడుతున్నారు. 

భారత క్రికెట్‌కు విశ్వవ్యాప్త ఖ్యాతి తెచ్చిన విరాట్‌ కనీసం ఇలాంటి వీడ్కోలు కూడా అర్హుడు కాడా అని ప్రశ్నిస్తున్నారు. విరాట్‌ ఇటీవలే టెస్ట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. విరాట్‌ గౌరవార్దం బీసీసీఐ ఎలాంటి వీడ్కోలు సన్నాహాలు ప్లాన్‌ చేయకపోవడమే అతని అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది. 

లంక క్రికెట్‌ బోర్డును చూసైనా బీసీసీఐ నేర్చుకోవాలని విరాట్‌ ఫ్యాన్స్‌ చురకలంటిస్తున్నారు. కాగా, విరాట్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాకే మాథ్యూస్‌ కూడా టెస్ట్‌లకు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. విరాట్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా టెస్ట్‌లకు ఆకస్మిక రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 

38 ఏళ్ల ఏంజెలో మాథ్యూస్‌ శ్రీలంక తరఫున 118 టెస్ట్‌లు, 226 వన్డేలు, 90 టీ20లు ఆడాడు. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన మాథ్యూస్‌ మధ్యలో గాయాల కారణంగా బౌలింగ్‌కు వీడ్కోలు పలికి కేవలం బ్యాటర్‌గానే కొనసాగాడు. 

మాథ్యూస్‌ టెస్ట్‌ల్లో ఓ డబుల్‌ సెంచరీ, 16 సెంచరీలు, 45 హాఫ్‌ సెంచరీల సాయంతో 8167 పరుగులు చేశాడు. వన్డేల్లో 3 సెంచరీలు, 40 హాఫ్‌ సెంచరీల సాయంతో 5916 పరుగులు చేశాడు. టీ20ల్లో 6 హాఫ్‌ సెంచరీల సాయంతో 1416 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో 33 వికెట్లు, వన్డేల్లో 126, టీ20ల్లో 45 వికెట్లు తీశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్‌ తలపడుతున్నాయి. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌ శ్రీలంకలో పర్యటిస్తుంది. గాలే వేదికగా ఇవాళ ప్రారంభమైన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

బంగ్లాదేశ్‌కు టాస్‌ గెలిచిన ఆనందం ఎంతోసేపు నిలబడలేదు. 5 పరుగులకే ఆ జట్టు ఓపెనర్‌ అనాముల్‌ హక్‌ (0) వికెట్‌ కోల్పోయింది. అశిత ఫెర్నాండో బౌలింగ్లో కుశాల్‌ మెండిస్‌కు క్యాచ్‌ ఇచ్చి అనాముల్‌ ఔటయ్యాడు. షద్మాన్‌ ఇస్లాం (8), మొమినుల్‌ హక్‌ (12) క్రీజ్‌లో ఉన్నారు. 9 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్‌ స్కోర్‌ 20/1గా ఉంది. ఈ సిరీస్‌తో బంగ్లాదేశ్‌ ఫుల్‌టైమ్‌ టెస్ట్‌ కెప్టెన్‌గా నజ్ముల్‌ హసన్‌ షాంటో జర్నీ మొదలవుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement