సిక్కి–సుమీత్‌ జోడీ శుభారంభం | Sikki and Sumeet Jodi is off to a good start | Sakshi
Sakshi News home page

సిక్కి–సుమీత్‌ జోడీ శుభారంభం

Jun 13 2024 4:06 AM | Updated on Jun 13 2024 4:06 AM

Sikki and Sumeet Jodi is off to a good start

సిడ్నీ: ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో సిక్కి రెడ్డి–సుమీత్‌ రెడ్డి (భారత్‌) జోడీ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో తెలంగాణకు చెందిన సిక్కి–సుమీత్‌ ద్వయం 21–17, 21–19తో వోంగ్‌ టియెన్‌ సి–లిమ్‌ చియెవ్‌ సియెన్‌ (మలేసియా) జంటపై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో శ్రీకృష్ణప్రియ–కోన తరుణ్‌ (భారత్‌)  జంట 6–21, 11–21తో హూ పాంగ్‌ రోన్‌–చెంగ్‌ సు యెన్‌ (మలేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. 

ప్రణయ్, సమీర్‌ ముందంజ 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత ప్లేయర్లు హెచ్‌ఎస్‌ ప్రణయ్, సమీర్‌ వర్మ, కిరణ్‌ జార్జి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ప్రణయ్‌ 21–10, 23–21తో యోగర్‌ కోల్హో (బ్రెజిల్‌)పై, సమీర్‌ వర్మ 21–10, 21–10తో రికీ టాంగ్‌ (ఆస్ట్రేలియా)పై, కిరణ్‌ 21–17, 21–10తో జియోడాంగ్‌ షాంగ్‌ (కెనడా)పై గెలిచారు.

ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో మిథున్‌ మంజునాథ్‌ (భారత్‌) 17–21, 17–21తో అల్వి ఫర్హాన్‌ (ఇండోనేసియా) చేతిలో, శంకర్‌ ముత్తుస్వామి (భారత్‌) 16–21, 21–18, 10–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో, అభిషేక్‌ (భారత్‌) 9–21, 15–21తో మిషా జిల్బెర్‌మన్‌ (ఇజ్రాయెల్‌) చేతిలో ఓడిపోయారు. 

పోరాడి ఓడిన సామియా 
మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత ప్లేయర్లు ఆకర్షి కశ్యప్, మాళవిక, అనుపమ ఉపాధ్యాయ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి చేరారు. హైదరాబాద్‌ అమ్మాయి సామియా ఫారూఖీ తొలి రౌండ్‌లో 23–21, 13–21, 22–24తో టాప్‌ సీడ్‌ పాయ్‌ యు పో (చైనీస్‌ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయింది. ఆకర్షి 21–14, 21–11తో పొలీనా బురోవా (ఉక్రెయిన్‌)పై, మాళవిక 21–10, 21–8తో మోపాటి కెయురపై, అనుపమ 21–14, 23–21తో వోంగ్‌ లింగ్‌ చింగ్‌ (మలేసియా)పై గెలిచారు. 

Advertisement
 
Advertisement
Advertisement