
షూటర్ రాహీ సర్నోబత్ అసాధారణ పోరాటం
అనారోగ్యం నుంచి కోలుకొని బరిలోకి
రాహీ సర్నోబత్... భారత్ తరఫున షూటింగ్ ప్రపంచకప్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళ. మొత్తంగా షూటింగ్ ప్రపంచ కప్లలో ఆమె ఖాతాలో 5 స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలు ఉన్నాయి. దీంతో పాటు ఆసియా క్రీడల్లో స్వర్ణ, కాంస్యాలు... కామన్వెల్త్ క్రీడల్లో 2 స్వర్ణాలు, ఒక రజతం ఆమె గెలుచుకుంది. దాదాపు మూడేళ్ల క్రితం వరకు రాహీ భారత అత్యుత్తమ షూటర్లలో ఒకరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
అయితే 32 ఏళ్ల వయసులో ఆమె ఊహించని ఘటన రాహీ జీవితంలో చోటు చేసుకుంది. వరల్డ్ చాంపియన్షిప్ పోటీల కోసం ఆమె సిద్ధమవుతోంది. అనూహ్యంగా ఆమె శరీరంలో కాస్త మార్పు కనిపించింది. కొంత నొప్పిగా అనిపించినా ఆ సమయంలో దానిని పట్టించుకోలేదు. కానీ కొద్ది రోజుల తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. శరీరమంతా తట్టుకోలేనంత నొప్పితో విలవిల్లాడింది. బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి వచ్చింది. దాంతో అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించారు. అన్నింటిలో అంతా బాగుందనే వచ్చింది.
అసలు సమస్య ఏమిటనేది మాత్రం తేలలేదు. పరిస్థితి మరింత తీవ్రంగా మారి అసలు పడుకోలేని పరిస్థితి. కూర్చొని మాత్రమే నిద్రపోవాల్సి వచ్చేది. చివరకు ఆమెకు ‘న్యూరోపతిక్ పెయిన్’ ఉన్నట్లుగా డాక్టర్లు తేల్చారు. అయితే దీనికి ప్రత్యేక కారణం గానీ, ప్రత్యేక చికిత్స గానీ ఉండదని, ప్రతీ వ్యక్తికీ భిన్నమైన లక్షణాలు ఉంటాయని చెప్పడం రాహీలో ఆందోళనను మరింత పెంచింది. ‘కొన్ని నెలల పాటు రోజుకు 17–20 గంటలు కేవలం పడుకునేదాన్ని. అసలు ఏం జరుగుతోందో అర్థం కాకుండా పైకప్పు వైపు చూస్తూ ఉండిపోయేదాన్ని’ అని నాటి బాధాకర రోజులను రాహీ గుర్తు చేసుకుంది.
మహారాష్ట్ర ప్రభుత్వంలోని రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రాహీ అదృష్టవశాత్తూ ఆరోగ్యం మెరుగవడం మొదలైంది. కొన్ని నెలల తర్వాత నొప్పి పూర్తిగా తగ్గకపోయినా ఫిజియోథెరపీని మొదలు పెట్టారు. నిర్విరామంగా 20 నిమిషాలు పాటు టీవీ షో చూడటం కూడా ఆమె మొదటి ఎక్సర్సైజ్గా మారింది. మొదట్లో అది కూడా కష్టంగా అనిపించింది. అయితే ఫిజియోథెరపీతో నెమ్మదిగా పరిస్థితి మారి కొంత ఎక్కువ సమయం కూర్చోవడం మొదలు పెట్టింది.
ఆ సమయంలో ఆమె ఆటలో పునరాగమనం గురించి అస్సలు ఆలోచించలేదు. అసలు జీవితం సాధారణంగా మారి ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకునే పరిస్థితి మాత్రమే ఆమెది. కానీ రాహీ చివరకు కోలుకొని ఆపై ఫిట్నెస్పై కూడా దృష్టి పెట్టింది. అంతా చక్కబడటంతో సర్నోబత్ మళ్లీ గన్ పట్టుకొని షూటింగ్ మొదలు పెట్టింది. ఈ సారి తనను తాను నిరూపించుకునేందుకో, పతకాలు గెలుచుకునేందుకో కాదు. తాను ఎలాంటి కఠిన పరిస్థితులను దాటి ధైర్యంగా నిలబడ్డానో, జీవితం ఇచ్చిన రెండో అవకాశాన్ని పట్టుదలగా ఎలా వాడుకున్నానో చూపించేందుకు రాహీ మళ్లీ ఆటలోకి అడుగు పెట్టింది.
ఇటీవల డెహ్రాడూన్లో జరిగిన జాతీయ క్రీడల్లో 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణం సాధించడంతో ఆమె కొత్త జీవితం మొదలైంది. రియో, టోక్యో ఒలింపిక్స్లలో పాల్గొన్న రాహీ సర్నోబత్ ఇప్పుడు మరోసారి తన స్వప్నం ఒలింపిక్స్ పతకం కోసం సిద్ధమవుతోంది. అసలు లేవలేని పరిస్థితి నుంచి కోలుకొని మళ్లీ సత్తా చాటుతూ లాస్ ఏంజెలిస్ గేమ్స్ లక్ష్యంగా తన సన్నాహాలు చేస్తోంది.
- సాక్షి క్రీడా విభాగం