వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా ప్రతినిధుల విందులో కాల్పుల కలకలం రేగిన సంగతి తెలిసిందే. భద్రతా బలగాలు నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. కాల్పుల శబ్దంతో ట్రంప్ను వెంటనే వేదికపై నుండి సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాల్పుల జరిపిన వ్యక్తిని కాలిఫోర్నియాకు చెందిన కోల్ అలెన్గా గుర్తించారు. నిందితుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని.. టీచర్ ఆఫ్ ది మంత్ అవార్డు కూడా అతడు తీసుకున్నట్లు సమాచారం.
వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వద్ద కాల్పులకు తెగబడినట్లు భావిస్తున్న వ్యక్తి మొదటి చిత్రం వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ హిల్టన్ హోటల్ మెట్ల వద్ద భద్రతా సిబ్బంది అతడిని నేలపై నొక్కిపట్టి ఉంచినట్లు ఆ చిత్రంలో కనిపిస్తోంది. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ 'ట్రూత్ సోషల్'లో ఈ చిత్రాలను పంచుకున్నారు. అందులో అనుమానితుడు చొక్కా లేకుండా.. చేతులు వెనుకకు కట్టేసి, నేలపై పడి ఉండటం గమనార్హం.
ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన ట్రంప్.. అనుమానితుడు పలు ఆయుధాలతో ఉన్నాడని, సీక్రెట్ సర్వీస్ అధికారులు అతడిని అడ్డుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఒక అధికారిపై కాల్పులు జరిగాయని, అయితే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం వల్ల అతను ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడని చెప్పారు. ఒక వ్యక్తి ఆయుధాలతో సెక్యూరిటీ చెక్పాయింట్ వద్దకు దూసుకువచ్చాడు, సీక్రెట్ సర్వీస్ సభ్యులు ధైర్యంగా అతడిని పట్టుకున్నారు. ఒక అధికారికి గాయమైంది.. కానీ జాకెట్ అతడిని కాపాడింది. నేను ఆ అధికారితో మాట్లాడాను. అతను క్షేమంగా ఉన్నాడు" అని ట్రంప్ పేర్కొన్నారు.


