ట్రంప్‌పై హత్యాయత్నం.. వైట్‌హౌస్‌ వద్ద కాల్పులు.. | Donald Trump evacuated after gunshots fired at White House | Sakshi
Sakshi News home page

ట్రంప్‌పై హత్యాయత్నం.. వైట్‌హౌస్‌ వద్ద కాల్పులు..

Apr 26 2026 6:56 AM | Updated on Apr 26 2026 7:50 AM

Donald Trump evacuated after gunshots fired at White House

వాషింగ్టన్‌: అమెరికాలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. వైట్‌హౌస్‌ వద్ద కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ట్రంప్‌, జేడీ వాన్స్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. అనంతరం, ట్రంప్‌ సహా కీలక నేతలను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

వివరాల మేరకు.. అధ్యక్షుడు ట్రంప్‌ వైట్‌హౌస్‌ సమీపంలో ఉన్న హిల్టర్‌ హోటల్‌లో కరస్పాండెంట్స్ డిన్నర్ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు అధ్యక్షుడు ట్రంప్‌, ఫస్ట్‌ లేడీ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. డిన్నర్‌ జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. దీంతో, భయానక పరిస్థితి నెలకొంది. 

తక్షణం స్పందించిన సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు వెంటనే బ్యాంకెట్‌ హాల్‌లోకి ప్రవేశించి అధ్యక్షుడు ట్రంప్‌, ఫస్ట్‌ లేడీ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో సహా పలువురు కీలక నేతలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాల్పుల శబ్ధం, గందరగోళ పరిస్థితి కారణంగా ఆ ఈవెంట్‌లో పాల్గొన్న వందలాది అతిథులు టేబుళ్ల కింద దాక్కున్నారు. ప్రాణ భయంతో వణికిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. 

 

అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. డిన్నర్‌ ఈవెంట్‌కు దాదాపు 2600 మంది హాజరైనట్టు సమచారం. ఇక, కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న వ్యక్తిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. కాగా, దుండగులు దాదాపు 7-8 రౌండ్లు కాల్పులు జరిపినట్టు సీఐఏ అధికారులు గుర్తించారు. అనంతరం, భద్రతా బలగాలు హోటల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 
 

ఈ నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు పోస్టులో ట్రంప్‌..‘వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ చాలా అద్భుతంగా గడిచింది. సీక్రెట్ సర్వీస్ మరియు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అద్భుతమైన పనిచేశాయి. వారు వేగంగా, ధైర్యంగా స్పందించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నారు, మరియు 'కార్యక్రమాన్ని కొనసాగిద్దాం' అని నేను సిఫార్సు చేశాను, కానీ ఇది పూర్తిగా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ మార్గదర్శకత్వంలోనే జరుగుతుంది. వారు త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయంతో సంబంధం లేకుండా, ఈ సాయంత్రం అనుకున్నదానికంటే చాలా భిన్నంగా ఉంటుంది, మనం దీన్ని మళ్ళీ నిర్వహించాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. 

Advertisement
 
Advertisement
Advertisement