T20 WC 2022: అస్సలు బాలేదు.. కోహ్లి, రోహిత్‌ తమ మార్కు చూపించాలి.. లేదంటే కష్టమే!

Shoaib Akhtar: It Is Yet To Be Seen Last WC Pressure On Rohit And Kohli - Sakshi

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌-2022 నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ సారథి విరాట్‌ కోహ్లి మరింత ఒత్తిడిలో కూరుకుపోయే అవకాశం ఉందని రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ అన్నాడు. ఫామ్‌లేమి కారణంగా వారు ఇబ్బంది పడుతున్నారని.. ఒకవేళ వాళ్లిద్దరికీ ఇది చివరి వరల్డ్‌కప్‌ అనుకుంటే ఒత్తిడి రెట్టింపు అవుతుందని అభిప్రాయపడ్డాడు.

ఏ ఆటగాడి కెరీర్‌లోనైనా ఇలాంటి పరిస్థితులు ఎదురవడం సహజమని, సచిన్‌ టెండుల్కర్‌ సైతం చాలా కాలం పాటు సెంచరీ చేయలేక సతమైన సందర్భాన్ని ఈ పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ గుర్తు చేశాడు. కాగా గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో కోహ్లి సారథ్యంలోని టీమిండియా ఘోర వైఫల్యంతో విమర్శలు మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత రోహిత్‌ శర్మ భారత జట్టు కెప్టెన్‌ అయ్యాడు.

ఇద్దరిదీ ఒకే కథ!
హిట్‌మ్యాన్‌ సారథ్యంలో స్వదేశంలో వరుస టీ20 సిరీస్‌లు గెలిచిన టీమిండియా ఈ ఏడాది పొట్టి ఫార్మాట్‌ ప్రపంచకప్‌నకు సిద్ధమవుతోంది. అయితే, ఐపీఎల్‌-2022లో కోహ్లి, రోహిత్‌ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆర్సీబీ బ్యాటర్‌ విరాట్‌ 341 పరుగులు చేశాడు. ఇక ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ అయిన రోహిత్‌ శర్మ కేవలం 268 పరుగులు మాత్రమే చేసి విమర్శలపాలయ్యాడు. ఎన్నడూ లేని విధంగా ముంబై జట్టు సైతం ఘోరంగా విఫలమైంది. ఆఖరి స్థానంతో ఐపీఎల్‌-2022 సీజన్‌ను ముగించింది.

సచిన్‌కే తప్పలేదు! అవును.. అందుకే!
ఈ నేపథ్యంలో షోయబ్‌ అక్తర్‌, టీమిండియా మాజీ బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ మధ్య వీరిద్దరి భవిష్యత్‌ గురించి ఆసక్తికర చర్చ నడిచింది. స్పోర్ట్స్‌కీడాతో అక్తర్‌ మాట్లాడుతూ.. ‘‘విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మకు ఇదే రకమైన ఆట కొనసాగిస్తే.. వారికి ఇదే చివరి ఐపీఎల్‌, చివరి వరల్డ్‌కప్‌ అని అనుకుంటే.. ఫామ్‌లేమి కారణంగా మరింత ఒత్తిడిలో కూరుకుపోతారు. కెరీర్‌పై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఇందుకు సచిన్‌నే ఉదాహరణగా తీసుకుంటే.. ఒకానొక సందర్భంలో అతడు సెంచరీ సాధించడానికి ఎంతగా శ్రమించాల్సి వచ్చిందో, ఎంతగా ఎదురుచూడాల్సి వచ్చిందో తెలుసు కదా’’ అని పేర్కొన్నాడు. ఇందుకు భజ్జీ బదులిస్తూ.. ‘‘అవును.. వాళ్లిద్దరికీ ఈ ఐపీఎల్‌ సీజన్‌ అంత గొప్పగా ఏమీలేదు. నిజానికి వాళ్లిద్దరికీ టీ20 వరల్డ్‌కప్‌ కీలకం. నవతరం ఆటగాళ్లు దూసుకువస్తున్నారు.

ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో తెలియదు. కాబట్టి కోహ్లి, రోహిత్‌ కచ్చితంగా ఈ ప్రపంచకప్‌లో తమ మార్కు చూపించాలి’’ అని చెప్పుకొచ్చాడు. ఒకవేళ సరిగ్గా ఆడకపోతే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే పరిస్థితి ఉందని అభిప్రాయపడ్డాడు. 

చదవండి: IPL 2022: 'మేము అతడి సేవలను కోల్పోయాము.. మా జట్టులో ఉంటే బాగుండేది'
IPL 2022: ఐపీఎల్‌ 2023 ముందు.. ఆ ముగ్గురికి గుడ్‌బై చెప్పనున్న ఎస్‌ఆర్‌హెచ్‌..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top