పాకిస్తాన్ టెస్ట్ జట్టు కెప్టెన్ షాన్ మసూద్ (Shan Masood) స్వదేశీ ఫస్ట్ క్లాస్ ఫార్మాట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ప్రెసిడెంట్స్ కప్ 2025-26లో భాగంగా సహారా అసోసియేట్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. సూయ్ నార్త్రన్ గ్యాస్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న షాన్.. 177 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు.
గతంలో పాకిస్తాన్ ఫస్ట్ క్లాస్ ఫార్మాట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ఆ దేశ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హాక్ పేరిట ఉండేది. ఇంజమామ్ 1992లో ఇంగ్లండ్పై 188 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. 33 ఏళ్ల తర్వాత షాన్ ఇంజమామ్ పేరిట ఉండిన రికార్డును బద్దలు కొట్టాడు.
అయితే, పాకిస్తాన్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన విదేశీ ఆటగాడి రికార్డు మాత్రం నేటికీ భారత మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఖాతాలో ఉంది. సెహ్వాగ్ 2006లో జరిగిన లాహోర్ టెస్టులో 182 బంతుల్లో డబుల్ సెంచరీ కొట్టాడు.
కాగా, యావత్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు షఫీకుల్లా షిన్వారి ఖాతాలో ఉంది. షిన్వారి ఆఫ్ఘనిస్తాన్ దేశవాలీ టోర్నీలో 89 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. షిన్వారి తర్వాత ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ఇంగ్లండ్ ఆటగాడు కే కింబర్ పేరిట ఉంది. ఇంగ్లండ్ కౌంట్లీ అతను 100 బంతుల్లో ఈ ఫీట్ను సాధించాడు.
షిన్వారి, కింబర్ తర్వాత ఈ రికార్డు భారత ఆటగాడు తన్మయ్ అగర్వాల్ పేరిట ఉంది. హైదరాబాద్కు చెందిన తన్మయ్ అరుణాచల్ ప్రదేశ్పై 119 బంతుల్లో డబుల్ పూర్తి చేశాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి నాలుగో స్థానంలో ఉన్నాడు. రవి రంజీ ట్రోఫీలో భాగంగా బరోడాతో జరిగిన మ్యాచ్లో 123 బంతుల్లోనే డబుల్ పూర్తి చేశాడు.


