
పోరాడి ఓడిన పీవీ సింధు
గాయత్రి–ట్రెసా ద్వయం అవుట్
ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
జకార్తా: భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లగా... పీవీ సింధు పరాజయంతో ఇంటిబాట పట్టింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సాత్విక్–చిరాగ్ జంట 16–21, 21–18, 22–20తో రస్ముస్ జార్–ఫ్రెడెరిక్ సొగార్డ్ (డెన్మార్క్) జంటపై విజయం సాధించింది.
68 నిమిషాల పాటు సాగిన పోరులో భారత జోడీ తొలి గేమ్ కోల్పోయిన అనంతరం తిరిగి పుంజుకొని వరుస గేమ్ల్లో ప్రపంచ 16వ ర్యాంక్ జంటపై గెలుపొందింది. మిగిలిన విభాగాల్లో పోటీపడిన భారత షట్లర్లంతా ఓటమి పాలవడంతో ఈ టోర్నమెంట్లో సాత్విక్–చిరాగ్ మాత్రమే పోటీలో నిలిచారు. గత వారం సింగపూర్ ఓపెన్లో సెమీస్కు చేరిన ఈ జంట... క్వార్టర్స్లో శుక్రవారం ఏడో ర్యాంక్ జోడీ మాన్ వై చాంగ్–కై వున్ టీ (మలేసియా) తలపడనుంది.
సింధు ఈసారి కూడా...
గత మ్యాచ్లో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)పై చక్కటి విజయంతో ఆశలు రేపిన పీవీ సింధు... అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు 22–20, 10–21, 18–21తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ పోర్న్పవీ చోచువోంగ్ (థాయ్లాండ్) చేతిలో పోరాడి ఓడింది. 78 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ గెలిచిన అనంతరం మిగిలిన రెండు గేమ్ల్లో ఓటమి పాలైంది.
‘ఈ మ్యాచ్ ను విజయంతో ముగించాల్సింది. ఓవరాల్గా నా ప్రదర్శన బాగానే ఉంది. ఈ టోర్నీ నుంచి ఎంతో నేర్చుకున్నా. పొరబాట్లు సరిదిద్దుకొని తర్వాతి టోర్నీలో మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా’ అని సింధు పేర్కొంది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్య వరియత్ ద్వయం 7–21, 12–21తో ఆరో సీడ్ దెచాపోల్–సుపిసారా (థాయ్లాండ్) జోడీ చేతిలో ఓడింది.
25 నిమిషాల్లో ముగిసిన పోరులో భారత జంట థాయ్లాండ్ ద్వయం జోరు ముందు నిలవలేకపోయింది. మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట 13–21, 22–24తో యుకీ ఫుకుషిమా–మయు మత్సుమోటో (జపాన్) ద్వయం చేతిలో ఓడింది.