చరిత్ర సృష్టించిన ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌ | Sakib Hussain becomes first indian bowler to take at least 1 wicket in 1st 10 IPL matches | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌

May 23 2026 10:16 AM | Updated on May 23 2026 10:33 AM

Sakib Hussain becomes first indian bowler to take at least 1 wicket in 1st 10 IPL matches

సన్‌రైజర్స్‌ యువ పేసర్‌ సాకిబ్‌ హుసేన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌ కెరీర్‌ తొలి 10 మ్యాచ్‌ల్లో కనీసం ఒక వికెట్‌ తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. నిన్న (మే 22) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి వికెట్‌ తీయడంతో సాకిబ్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. ఓవరాల్‌గా సాకిబ్‌కు ముందు ఫిల్ఫెన్హాస్‌ (13 వికెట్లు), ఎంగిడి (13) ఈ ఘనత సాధించిన బౌలర్లు ఉన్నారు. వీరిద్దరూ విదేశీయులే.

ఇదే సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ మ్యాచ్‌తో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన ఈ బిహారి బాయ్‌.. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. తొలి మ్యాచ్‌లోనే అదిరిపోయే ప్రదర్శన (4-24) ఇచ్చి అందరినీ ఆకట్టుకున్న సాకిబ్‌.. సన్‌రైజర్స్‌ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. యార్కర్లు, స్లో బాల్స్‌తో చెలరేగిపోయే ఈ నయా పేస్‌ సెన్సేషన్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు.

కాగా, నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ, గుజరాత్‌తో పాటు ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు చేరిన ఈ జట్టుకు ఈ విజయం ఎలాంటి అక్కరకు రాలేదు. ఆర్సీబీపై గెలిచినా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికే పరిమితమైన ఎలిమినేటర్‌ గండాన్ని దాటాల్సి వచ్చింది. 

తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఆర్సీబీ, గుజరాత్‌ క్వాలిఫయర్‌-1లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్‌-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. నాలుగో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కోసం​, ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ను ఎదుర్కొనేందుకు నాలుగు జట్లు (రాజస్థాన్‌, పంజాబ్‌, కేకేఆర్‌, ఢిల్లీ) పోటీపడుతున్నాయి. లక్నో, ముంబై, సీఎస్‌కే ఇదివరకే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

భారీ స్కోర్‌
టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుని ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడింది. అభిషేక్‌ శర్మ కేవలం 22 బంతుల్లో 56 పరుగులు చేసి పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను హైదరాబాద్‌వైపు తిప్పేశాడు. ట్రవిస్‌ హెడ్‌ (26) కూడా వేగంగా ఆడగా.. ఇషాన్‌ కిషన్‌ 46 బంతుల్లో 79 పరుగులతో మెరిపించాడు. చివర్లో హెన్రిచ్‌ క్లాసెన్‌ (24 బంతుల్లో 51), నితీశ్‌కుమార్‌ రెడ్డి (29 నాటౌట్‌) కూడా చెలరేగడంతో చేయడంతో హైదరాబాద్‌ 20 ఓవర్లలో 255/4 భారీ స్కోరు నమోదు చేసింది.

అనంతరం లక్ష్యఛేదనను ఆర్సీబీ కూడా ఘనంగానే ప్రారంభించినప్పటికీ.. ఆతర్వాత ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఆదిలో వెంకటేష్‌ అయ్యర్‌ (44) మెరుపులు మెరిపించాడు. కోహ్లి (15) మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆతర్వాత వచ్చిన పడిక్కల్‌ (21), రజత్‌ పాటిదార్‌ (56), కృనాల్‌ పాండ్యా (41 నాటౌట్‌), టిమ్‌ డేవిడ్‌ (15 నాటౌట్‌) పర్వాలేదనిపించినప్పటికీ.. లక్ష్యం​ మరీ పెద్దది కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు.

 

Advertisement
 
Advertisement
Advertisement