మా ఓటమికి కారణం అదే.. కానీ వారు అద్భుతంగా పోరాడారు: రోహిత్‌ శర్మ

Rohit Sharmas no nonsense response after Indias defeat to Bangladesh - Sakshi

ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఒక్క వికెట్‌ తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటర్లు విఫలమైనప్పటికీ.. బౌలర్లు మాత్రం అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ తప్పిదాల వల్ల ఈ మ్యాచ్‌ను భారత్‌ చేజేతులా పోగొట్టుకుంది. భారత బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌(73) మినహా మిగితా బ్యాటర్లందరూ తీవ్రంగా నిరాశ పరిచారు.

ఇక ఈ ఓటమిపై మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. బ్యాటింగ్‌లో మరో 25 నుంచి 30 పరుగులు చేసి ఉంటే మ్యాచ్‌ ఫలితం మరో విధంగా ఉండేది అని రోహిత్‌ అన్నాడు.

"ఈ మ్యాచ్‌లో మేము అద్భుతంగా పోరాడాం. క్రెడిట్‌ మొత్తం బౌలర్లకే ఇవ్వాలి. మ్యాచ్‌ను  అంత దగ్గరగా తీసుకురావడనికి వాళ్లు చాలా కష్టపడ్డారు. తొలి బంతి నుంచి మా బౌలర్లు బంగ్లా బ్యాటర్లకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. అఖరి వరకు పేసర్లు 100 శాతం ఎఫర్ట్‌ పెట్టారు. కానీ మేము బ్యాటింగ్‌లో విఫలమయ్యాం. టార్గెట్‌ 184 పరుగులు సరిపోవు.

మేము మరో 25-30 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం వేరే విధంగా ఉండేది. మా ఇన్నింగ్స్‌ 25 ఓవర్ల స్కోర్‌ను చూస్తే 240 నుంచి 250 పరుగులు వరకు సాధిస్తామని భావించాము. కానీ వరుసగా వికెట్లు కోల్పోవడంతో నా మాత్రపు స్కోర్‌కే పరిమితమయ్యాం. ముఖ్యంగా ఇటువంటి పిచ్‌లపై  ఎలా ఆడాలో నేర్చుకోవాలి. 

కాబట్టి తరువాతి మా రెండు ప్రాక్టీస్ సెషన్‌లలో ఈ వికెట్‌ను అర్థం చేసుకుని సాధన చేస్తాం. మా బాయ్స్‌ ఈ మ్యాచ్‌ నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారని నేను భావిస్తున్నాను. మేము మా తదుపరి మ్యాచ్‌ కోసం అతృతగా ఎదురుచూస్తున్నాము. రెండో వన్డేలో మెరుగ్గా రాణిస్తామని ఆశిస్తున్నాను" అని రోహిత్‌ పేర్కొన్నాడు. ఇక ఇరు జట్లు మధ్య  రెండో వ‌న్డే బుధ‌వారం జ‌ర‌గ‌నుంది.
చదవండి: IND VS BAN 1st ODI: క్యాచ్‌కు కనీస ప్రయత్నం చేయని సుందర్‌.. బండ బూతులతో విరుచుకుపడిన రోహిత్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top