
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. హెడింగ్లే వేదికగా తొలి టెస్ట్ జరుగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ (టెస్ట్లకు) తర్వాత టీమిండియా ఎదుర్కోబోతున్న తొలి పరీక్ష ఇదే. ఈ నేపథ్యంలో రోహిత్, విరాట్ల ప్రత్యామ్నాయాలు ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
ఈ విషయంలో ఇదివరకే చాలా మంది మాజీలు, విశ్లేషకులు తమతమ అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా టీమిండియా మాజీ ఆల్రౌండర్, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి కూడా రోహిత్, కోహ్లి ప్రత్యామ్నాయాలపై గళం విప్పాడు. రోహిత్ ఓపెనింగ్ స్థానాన్ని కేఎల్ భర్తీ చేయాలని శాస్త్రి సూచించాడు.
అలాగే కోహ్లి నంబర్-4లో ప్లేస్లో శుభ్మన్ గిల్ బ్యాటింగ్ రావాలని అన్నాడు. వన్డౌన్లో సాయి సుదర్శన్, ఐదో స్థానంలో కరుణ్ నాయర్ పేర్లను సూచించాడు. రాహుల్కు జతగా మరో ఓపెనర్గా యశస్వి జైస్వాల్, వికెట్కీపర్ బ్యాటర్గా రిషబ్ పంత్ను ఎంపిక చేశాడు.
స్పిన్ ఆల్రౌండర్ కోటాలో రవీంద్ర జడేజాను ఎంపిక చేసిన శాస్త్రి.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ను తేల్చడం కాస్త కష్టమని చెప్పాడు. ఈ స్థానం కోసం శార్దూల్ ఠాకూర్, నితీశ్ కుమార్ రెడ్డి మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
అంతిమంగా ఎవరు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయగలిగితే వారికే తుది జట్టులో చోటు ఉంటుందని తెలిపాడు. బ్యాటింగ్ పరంగా నితీశ్ పర్వాలేదని, అతను 15, 20 ఓవర్లు బౌలింగ్ చేయగలిగితే అతనికే తన ఓటని చెప్పాడు. ఈ మ్యాచ్లో భారత్ తప్పక ముగ్గురు ఫాస్ట్ బౌలర్లలో బరిలోకి దిగాలని శాస్త్రి సూచించాడు.
తొలి రెండు స్థానాలకు బుమ్రా, సిరాజ్ పేర్లను కన్ఫర్మ్ చేసిన శాస్త్రి.. మూడో ఫాస్ట్ బౌలర్ స్థానం కోసం ప్రసిద్ద్ కృష్ణ, అర్షదీప్ సింగ్ మధ్య పోటీ ఉంటుందని చెప్పాడు. మ్యాచ్ సమయానికి వాతావరణం మబ్బులు కమ్ముకుని ఉంటే బంతిని ఇరు వైపుల స్వింగ్ చేయగల అర్షదీప్కే తన ఓటని చెప్పాడు. ఒకవేళ వాతావరణం పొడిగా ఉంటే మాత్రం ప్రసిద్ద్ కృష్ణనే తుది జట్టులోని తీసుకోవాలని సూచించాడు.
ఐసీసీ రివ్యూ సందర్భంగా మాట్లాడుతూ శాస్త్రి ఈ అభిప్రాయాలను వ్యక్త పరిచాడు. ఈ సందర్భంగా శాస్త్రి కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, సాయి సుదర్శన్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. రాహుల్ ప్రస్తుతం భారత బ్యాటింగ్ సెటప్లో అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడని, గత ఇంగ్లండ్ పర్యటనలో అతను అద్భుతంగా రాణించాడని గుర్తు చేశాడు. చివరిసారి రాహుల్ ఇంగ్లండ్లో ఓపెనింగ్ చేసినప్పుడు సెంచరీ చేశాడని ప్రస్తావించాడు.
సాయి సుదర్శన్ తాజాగా ముగిసిన ఐపీఎల్లో, అంతకుముందు దేశవాలీ క్రికెట్లో విశేషంగా రాణించాడని, ఈ 23 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం తన నిలకడ ప్రదర్శనలతో అందరినీ మెప్పించాడని అన్నాడు. సాయి సుదర్శన్ మూడో స్థానంలో బరిలోకి దిగి ఈ ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతాలు చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
కరుణ్ నాయర్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుత ఫామ్ ప్రకారం కరుణ్ ఐదో స్థానంలో బ్యాటింగ్కు రావాలి. అతను చాలా కష్టపడి ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్ట్ జట్టులోకి పునరాగమనం చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతను సాధించిన పరుగుల అద్వితీయం. ఎంత ఫామ్లో ఉన్నా అన్ని పరుగులు సాధించడం చాలా కష్టం. ఇందుకు కరుణ్ చాలా గ్రౌండ్ వర్క్ చేశాడని శాస్త్రి అన్నాడు.
ఇంగ్లండ్తో తొలి టెస్టుకు రవిశాస్త్రి ఎంపిక చేసిన భారత ప్లేయింగ్ ఎలెవెన్..
యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి/శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్,ప్రసిద్ కృష్ణ/అర్షదీప్ సింగ్