ఆస్ట్రేలియా వెటరన్ ఆల్-రౌండర్ మోయిసెస్ హెన్రిక్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 39 ఏళ్ల హెన్రిక్స్ ఇకపై పోర్చుగల్ జాతీయ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో జరగబోయే టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్స్లో అతడు తన సొంత దేశమైన పోర్చుగల్కు ప్రాతినిథ్యం వహించనున్నాడు.
హెన్రిక్స్ ఆస్ట్రేలియా తరపున చివరగా 2021లో ఇంటర్ననేషనల్ క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా అతడికి జాతీయ జట్టులో చోటు దక్కలేదు. కానీ దేశవాళీ క్రికెట్లో మాత్రం రెగ్యూలర్గా ఆడుతూ వచ్చాడు. న్యూసౌత్వేల్స్కు కెప్టెన్గా, ప్లేయర్గా తన సేవలను అందించాడు.
అయితే హెన్రిక్స్ అనుహ్యంగా గతేడాది మార్చిలో ఫస్ట్క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చాడు. ఇప్పుడు ఆసీస్ జట్టులో అవకాశాలు రాకపోవడంతో తన మకాంను పోర్చుగల్కు మార్చాడు. అయినప్పటికి బిగ్బాష్ లీగ్లో మాత్రం మోయిసెస్ ఆడనున్నాడు.
ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఫుల్ మెంబర్ నేషన్ నుంచి అసోసియేట్ దేశానికి వెళ్లే ఆటగాళ్లు మూడేళ్ల కూలింగ్-ఆఫ్ పీరియడ్ను పూర్తి చేయాలి. అయితే హెన్రిక్స్ ఆస్ట్రేలియా తరపున 2021లో ఆడడంతో అతడి కూలింగ్ పీరియడ్ కూడా పూర్తి అయినట్లే. పోర్చుగల్ తరపున ఆడేందుకు అతడికి ఎలాంటి చిక్కులు లేవు.
కాగా హెన్రిక్స్ అంతర్జాతీయ క్రికెట్ ఎక్కువగా ఆడకపోయినప్పటికి, డొమాస్టిక్ క్రికెట్లో మాత్రం అపారమైన అనుభవం ఉంది. 131 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లతో పాటు 141 లిస్ట్-ఎ, 301 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్లో కేకేఆర్, ఢిల్లీ, ఆర్సీబీ, సన్రైజర్స్ హైదరాబాద్,పంజాబ్ కింగ్స్ వంటి జట్లకు అతడు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్-2016 విజేతగా నిలిచిన ఎస్ఆర్హెచ్ జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు.
ఇక ఇది ఇలా ఉండగా.. ఒక ఆస్ట్రేలియా ఆటగాడు అసోసియేట్ దేశానికి మారడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జో బర్న్స్ తన కుటుంబ నేపథ్యం కారణంగా ఇటలీకి మకాం మార్చాడు. 2025లో ఇటలీ తరపున అతడు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు.
చదవండి: నేడే ప్రపంచకప్ తొలి సెమీఫైనల్


