Photo Credit: BCCI Twitter
కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఫాలో ఆన్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఫాలో ఆన్లో మాత్రం లంక జాగ్రత్తగా ఆడుతోంది. భారత్కు విజయం దక్కనివ్వొద్దనే కాంక్షతో లంక బ్యాటర్లు జిడ్డు బ్యాటింగ్ను ప్రదర్శిస్తున్నారు. దీనికి తోడు టీమిండియా ఫీల్డర్లు పలు క్యాచ్లు జారవిడవడం కూడా లంకకు కలిసొచ్చింది.
ముఖ్యంగా పసిందు సూరియబండారా భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ప్రస్తుతం 90 పరుగులతో ఆడుతున్న సూరియబండారా 21 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతడు ఇచ్చిన క్యాచ్ను ప్రసిధ్ క్రిష్ణ వదిలేయడం భారత్ కొంపముంచింది. జడేజా వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
జడేజా వేసిన ఫ్లైటెడ్ డెలివరీని పసిందు బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ప్రసిధ్ క్యాచ్ అందుకోవడం కష్టతరమైనప్పటికీ, కాస్త ముందుకు డైవ్ చేసి ఉంటే సులువుగా క్యాచ్ తీసుకునేవాడే. కానీ అతడు ప్రయత్నం చేయకపోవడంతో బంతి అతని చేతి వేళ్లను తాకుతూ పక్కకు వెళ్లిపోయింది. ఇది చూసిన జడేజా..‘ అరె బాయ్.. ఏ క్యా హై?’ అంటూ ప్రసిధ్పై ఆగ్రహం వ్యక్తం చేయడం స్టంప్ మైక్లో రికార్డయింది.
ఇదే సమయంలో డ్రెసింగ్ రూమ్ నుంచి గమనిస్తున్న కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ప్రసిధ్ క్యాచ్ జారవిడవడంపై అసహనం వ్యక్తం చేస్తున్న ఫొటోలు కెమెరా కంటికి చిక్కాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అలా క్యాచ్ డ్రాప్తో బతికిపోయిన పసిందు సూరియబండారా ఇప్పుడు సెంచరీకి చేరువలో ఉన్నాడు.
తనకు వచ్చిన లైఫ్ను సద్వినియోగం చేసుకున్న పసిందు ఆ తర్వాత ఫిఫ్టీ సాధించడంతో పాటు తన జిడ్డు బ్యాటింగ్తో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఒకవేళ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పసిందు ఇచ్చిన క్యాచ్ను ప్రసిధ్ అందుకొని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
— crictalk (@crictalk7) August 26, 2026
Read: నంబర్వన్ బౌలర్గా స్టార్క్.. 16 ఏళ్ల కెరీర్లో తొలిసారి


