షాకింగ్‌ న్యూస్‌.. రిటైర్మెంట్‌ ప్రకటించిన సిక్సర్ల వీరుడు | Pooran Announces Shock International Retirement At 29 | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ న్యూస్‌.. రిటైర్మెంట్‌ ప్రకటించిన సిక్సర్ల వీరుడు

Jun 10 2025 10:20 AM | Updated on Jun 10 2025 12:17 PM

Pooran Announces Shock International Retirement At 29

విండీస్‌ విధ్వంసకర యోధుడు నికోలస్‌ పూరన్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నాడు. 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. ఈ విషయాన్ని సోషల్‌మీడియాలో వేదికగా వెల్లడించాడు. పూరన్‌ రిటైర్మెంట్‌ను విండీస్‌ క్రికెట్‌ బోర్డు ధృవీకరించింది. కరీబియన్‌ క్రికెట్‌కు పూరన్‌ చేసిన సేవలను కొనియాడింది. రిటైర్మెంట్‌ సందర్భంగా పూరన్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. 

మెరూన్‌ జెర్సీలో కరీబియన్‌ దీవులకు ప్రాతినిథ్యం వహించడం గొప్ప గౌరమని అన్నాడు. క్రికెట్‌ తనకెంతో ఇచ్చిందని చెప్పాడు. విండీస్‌ జట్టుకు సారథ్యం వహించిన క్షణాలు నా హృదయానికి దగ్గరగా నిలిచిపోతాయని అన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌ ముగిసినా విండీస్‌ క్రికెట్‌పై నా ప్రేమ ఎప్పటికీ తరగదని తెలిపాడు.

2016లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పూరన్‌.. విండీస్‌ తరఫున 106 టీ20లు, 61 వన్డేలు ఆడాడు. టీ20 స్పెషలిస్ట్‌గా పేరొందిన పూరన్‌ ఈ ఫార్మాట్‌లో 136.4 స్ట్రయిక్‌రేట్‌తో 13 హాఫ్‌ సెంచరీల సాయంతో 2275 పరుగులు చేశాడు. వన్డేల్లో 3 సెంచరీలు, 11 హాఫ్‌ సెంచరీల సాయంతో 1983 పరుగులు చేశాడు. 

పూరన్‌ సుదీర్ఘ ఫార్మాట్‌లో (టెస్ట్‌ల్లో) ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. పూరన్‌ రిటైర్మెంట్‌ పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఇప్పుడిప్పుడే తిరోగమనం చేస్తున్న విండీస్‌కు తీరని లోటు.

పూరన్‌ 2022లో విండీస్‌ కెప్టెన్‌గానూ సేవలందించాడు. వన్డే, టీ20 ఫార్మాట్లలో 30 మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసి కేవలం 8 మ్యాచ్‌ల్లో మాత్రమే తన జట్టును గెలిపించుకోగలిగాడు. ఆస్ట్రేలియాలో జరిగిన 2022 టీ20 వరల్డ్‌కప్‌లో విండీస్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టడంతో పూరన్‌ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.

పూరన్‌ గతేడాది నుంచి టీ20ల్లో సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. గతేడాది పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు (170) బాదిన ఆటగాడిగా నిలిచాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్‌లోనూ అత్యధిక సిక్సర్ల (40) రికార్డును దక్కించుకున్నాడు. ఈ సీజన్‌ ఐపీఎల్‌లో 500 పరుగుల మార్కును (లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున) దాటిన పూరన్‌.. ఐపీఎల్‌లో తొలిసారి ఈ ఘనత సాధించాడు.

పూరన్‌ను ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపిక చేయలేదు. అతనే స్వయంగా విశ్రాంతి కావాలని విండీస్‌ బోర్డును కోరాడు. పూరన్‌ విండీస్‌ తరఫున అత్యధిక టీ20లు ఆడిన ఆటగాడిగా ఉన్నాడు. అలాగే పొట్టి ఫార్మాట్‌లో విండీస్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ నిలిచాడు. 2019లో వన్డే అరంగేట్రం చేసిన పూరన్‌.. విండీస్‌ 2023 వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోయినప్పటి నుంచి ఆ ఫార్మాట్‌ను వదిలేశాడు. పూరన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా లీగ్‌ క్రికెట్‌లో కొనసాగుతాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement