
నార్వే చెస్ టోర్నమెంట్లో వరల్డ్ నెం1 మాగ్నస్ కార్ల్సెన్ను భారత యువ గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేష్ ఖంగుతిన్పించాడు. ఆదివారం ఆర్ధరాత్రి దాటాక జరిగిన ఈ టోర్నీ ఆరో రౌండ్లో కార్ల్సెన్ను గుకేష్ ఓడించాడు. ఆఖరివరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ గేమ్లో గుకేష్ పై చేయి సాధించాడు.
ఈ గేమ్లో మధ్యవరకు కార్ల్సెన్ ఆధిపత్యం చెలాయించాడు. కానీ ఎండ్గేమ్ సమయానికి 34 ఏళ్ల కార్ల్సెన్ చేసిన ఒక చిన్న తప్పిదాన్ని గుకేష్ చక్కగా ఉపయోగించుకున్నాడు. కాగా క్లాసికల్ చెస్ పోటీలో కార్ల్సన్ను ఓడించడం గుకేశ్కు ఇదే తొలిసారి. ఈ గెలుపుతో గుకేష్ మూడు విలువైన పాయింట్లు సొంతం చేసుకున్నాడు.
తద్వారా ఈ టోర్నీ పాయింట్ల పట్టికలో గుకేష్ రెండో స్ధానానికి దూసుకొచ్చాడు. ప్రస్తుతం అతని స్కోరు 8.5 పాయింట్లు కాగా, రెండో స్థానంలో ఉన్న అమెరికన్ గ్రాండ్మాస్టర్ ఫాబియానో కరువానాకు కేవలం ఒక పాయింట్ తక్కువగానే ఉన్నాడు.
ఓ మై గాడ్.. !
ఇక యువ గ్రాండ్మాస్టర్ చేతిలో ఓటమిని ప్రపంచ చెస్ దిగ్గజం కార్ల్సెన్ తట్టుకోలేకపోయాడు. తీవ్ర అసహనానికి గురైన మాగ్నస్.. ఓ మై గాడ్ అంటూ పిడికిలితో ఒక్కసారిగా చెస్బోర్డు టేబుల్ను బలంగా పంచ్ చేశాడు. అనంతరం గుకేశ్కు రెండు సార్లు సారీ చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అదేవిధంగా వరల్డ్ నెంబర్ 1 ఆటగాడిని ఓడించిన గుకేష్.. కాసేపు షాక్లో ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
OH MY GOD 😳🤯😲 pic.twitter.com/QSbbrvQFkE
— Norway Chess (@NorwayChess) June 1, 2025