source: X
బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసియా క్రీడల తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని రాతపూర్వకంగా బోర్డుకు తెలియజేసింది. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుని బ్యాటింగ్, వికెట్ కీపింగ్పై మరింత దృష్టి పెట్టాలని నిగర్ భావిస్తోంది. అయితే వన్డే ఫార్మాట్లో మాత్రం కెప్టెన్గా కొనసాగనుంది.
నిగర్ 2022లో బంగ్లాదేశ్ టీ20 జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టింది. ఆమె కెప్టెన్సీలో జట్టు కొన్ని కీలక విజయాలు సాధించింది. 2024 టీ20 ప్రపంచకప్లో స్కాట్లాండ్పై విజయం బంగ్లాదేశ్కు ప్రత్యేకంగా నిలిచింది. ప్రపంచకప్లో దాదాపు పదేళ్ల తర్వాత బంగ్లాదేశ్కు ఇదే తొలి విజయం.
ఆ టోర్నీలో నిగర్ సుల్తానా బ్యాట్తోనూ, వికెట్ కీపర్గా కూడా రాణించింది. నాలుగు ఇన్నింగ్స్ల్లో 104 పరుగులు చేయడంతో పాటు వికెట్ల వెనుక ఏడు డిస్మిసల్స్లో భాగమైంది.
ఇటీవలి ఫలితాలతో ఒత్తిడి
టీ20 ఫార్మాట్లో నిగర్ సుల్తానాకు ఇటీవల మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. 2026 టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో బంగ్లాదేశ్ అజేయంగా ఛాంపియన్గా నిలిచినప్పటికీ.. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ను 1-2తో కోల్పోయింది.
స్కాట్లాండ్-నెదర్లాండ్స్తో జరిగిన ట్రై-సిరీస్లోనూ మిశ్రమ ఫలితాలు వచ్చాయి. టీ20 ప్రపంచకప్లో ఐదు మ్యాచ్ల్లో రెండు విజయాలు మాత్రమే దక్కాయి.
కాగా, ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్ పోటీల్లో బంగ్లాదేశ్ నిగర్ నేతృత్వంలోనే బరిలోకి దిగనుంది. ఈ పోటీలు సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభం కానుండగా.. బంగ్లాదేశ్ ఆరంభ రోజునే తొలి మ్యాచ్లో చైనాతో క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది.
ఇదీ చదవండి: ఆసీస్పై 5 వికెట్ల ప్రదర్శన.. రికార్డులు కొల్లగొట్టిన జింబాబ్వే బౌలర్


