కెప్టెన్‌గా శార్దూల్‌ ఠాకూర్‌పై వేటు | Mumbai Replaced Shardul Thakur New Captain For Ranji Trophy | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌గా శార్దూల్‌ ఠాకూర్‌పై వేటు

Sep 1 2026 2:22 PM | Updated on Sep 1 2026 2:33 PM

Mumbai Replaced Shardul Thakur New Captain For Ranji Trophy

శార్దూల్‌ ఠాకూర్‌ (PC: BCCI)

ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ తాజా సీజన్‌కు ముందు ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (MCA) కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై జట్టు కెప్టెన్సీ నుంచి టీమిండియా ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ను తప్పించింది. అతడి స్థానంలో కొత్త సారథిని ఎంపిక చేసింది.

కాగా గతేడాది అజింక్య రహానే కెప్టెన్‌ పదవి నుంచి వైదొలిగిన తర్వాత జట్టు పగ్గాల్ని ఎంసీఏ శార్దూల్‌ ఠాకూర్‌కు అప్పగించింది.  ఈ ఆల్‌రౌండర్‌ సారథ్యంలో ముంబై ఈ ఏడాది తమ గ్రూప్‌ దశలో అజేయంగా క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, క్వార్టర్స్‌లో కర్ణాటక చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.

మొత్తంగా రంజీల్లో శార్దూల్‌ కెప్టెన్సీలో ముంబై నాలుగు మ్యాచ్‌లు గెలిచి.. ఒకటి ఓడి.. మూడు డ్రా చేసుకుంది. కాగా శార్దూల్‌ ఠాకూర్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించడానికి గల కారణాన్ని ఎంసీఏ చీఫ్‌ సెలక్టర్‌ రాజేశ్‌ పవార్‌ తాజాగా వెల్లడించారు.

అందుకే తప్పించాము 
టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్సీ రూపంలో శార్దూల్‌పై మరోసారి అదనపు భారం వేసేందుకు మేము సిద్ధంగా లేము. అతడిపై పనిభారం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది.

రంజీ ట్రోఫీలో 10 మ్యాచ్‌లు ఆడాలి. వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా తరచూ అతడికి విశ్రాంతి ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని రాజేశ్‌ పవార్‌ తెలిపాడు. శార్దూల్‌తో చర్చించిన తర్వాతే కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసినట్లు వెల్లడించాడు.

కొత్త సారథిగా అతడే
ముంబై కొత్త కెప్టెన్‌గా సిద్దేశ్‌ లాడ్‌ ఎంపికయ్యాడు. 34 ఏళ్ల సిద్దేశ్‌ సుదీర్ఘ కాలంగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 135 ఇన్నింగ్స్‌లో కలిపి 5623 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ ఖాతాలో.. 15 శతకాలు, 30 అర్ధ శతకాలు ఉన్నాయి.

పరుగుల వరద
గత రంజీ సీజన్‌లో సిద్దేశ్‌ లాడ్‌ 11 ఇన్నింగ్స్‌ ఆడి సగటు 77.40తో 774 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉండగా.. నాలుగు వరుసగా సాధించడం విశేషం. అంతకుముందు సీజన్‌ అంటే.. రంజీ ట్రోఫీ 2024-25లో సిద్దేశ్‌ 12 ఇన్నింగ్స్‌లో కలిపి 602 పరుగులు చేశాడు. తద్వారా ముంబై బ్యాటింగ్‌ లైనప్‌లో కీలక ఆటగాడిగా పేరుగాంచాడు.

కాగా రంజీ 92వ ఎడిషన్‌ అక్టోబరు 11 నుంచి మొదలుకానుంది. ముంబై తమ తొలి మ్యాచ్‌లో చండీగఢ్‌తో తలపడేందుకు సిద్ధంగా ఉంది. కాగా రంజీల్లో ముంబైకి ఘనమైన చరిత్ర ఉంది. 

ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో ముంబై 42సార్లు చాంపియన్‌గా నిలిచింది. చివరగా 2023-24 సీజన్‌లో రహానే కెప్టెన్సీలో ట్రోఫీని ముద్దాడింది. ఇదిలా ఉంటే.. 2025-26 సీజన్లో అసాధారణ రీతిలో జమ్మూ కశ్మీర్‌ తొలిసారి రంజీ టైటిల్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement