నరాలు తెగే ఉత్కంఠ.. ఒక్క పరుగు తేడాతో.. | T20 Mumbai League: Aakash Tigers Beat Eagle Thane By 1 Run Thrilling Clash | Sakshi
Sakshi News home page

నరాలు తెగే ఉత్కంఠ.. ఒక్క పరుగు తేడాతో..

Jun 4 2026 12:55 PM | Updated on Jun 4 2026 1:09 PM

T20 Mumbai League: Aakash Tigers Beat Eagle Thane By 1 Run Thrilling Clash

PC: t20 mumbai league

ముంబై టీ20 లీగ్‌లో బుధవారం రెండు ఆసక్తికర మ్యాచ్‌లు జరిగాయి. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. వాంఖడే వేదికగా మధ్యాహ్నం మ్యాచ్‌లో బాంద్రా బ్లాస్టర్స్‌- నార్త్‌ ముంబై పాంథర్స్‌ జట్లు తలపడ్డాయి.

‘సూపర్‌’ విజయం
ఈ మ్యాచ్‌లో బాంద్రా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా.. నార్త్‌ ముంబై సైతం 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి సరిగ్గా 228 పరుగులే చేసింది. దీంతో సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా.. నార్త్‌ ముంబై గెలుపు జెండా ఎగురవేసింది.

172 పరుగులు
ఇక సాయంత్రం మ్యాచ్‌లో ఆకాశ్‌ టైగర్స్‌- ఈగల్‌ థానే స్ట్రైకర్స్‌ పోటీపడ్డాయి. వాంఖడే మైదానంలో టాస్‌ గెలిచిన ఈగల్‌ థానే కెప్టెన్‌ శార్దూల్‌ ఠాకూర్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆకాశ్‌ టైగర్స్‌... 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.

ఓపెనర్లలో జై గోకుల్‌ బిస్తా అర్ధ శతకం (56)తో రాణించగా.. కెప్టెన్‌ షామ్స్‌ ములానీ 22 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వారిలో సఖామ్‌ పరాషర్‌, సౌరభ్‌ సింగ్‌ చెరో 30 పరుగులు చేశారు. ఈగల్‌ ఠానే బౌలర్లలో ఓంకార్‌ తర్మాలే మూడు వికెట్లతో సత్తా చాటగా.. అథర్వ ఆంకోలేకర్‌, సాయిరాజ్‌ పాటిల్‌, కార్తిక్‌ మిశ్రా, అమర్త్య రాజే తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఈగల్‌ థానేకు ఆరంభంలోనే షాకులు తగిలాయి. ఓపెనర్‌ శశ్వత్‌ జగ్‌తాప్‌ 2 పరుగులకే నిష్క్రమించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఏక్‌నాథ్‌ కేర్కార్‌ 3 పరుగులు చేసి అవుటయ్యాడు. మరో ఓపెనర్‌ సుమేర్‌ జవేరి 26 పరుగులు చేయగా.. సాయిరాజ్‌ పాటిల్‌ 39, వినయ్‌ కన్వార్‌ 24 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు.

మెరుపు ఇన్నింగ్స్‌
మిగిలిన వారిలో సిద్ధాంత్‌ సింగ్‌ (19 బంతుల్లో 37).. కెప్టెన్‌ శార్దూల్‌ ఠాకూర్‌ (15 బంతుల్లో 25) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి విజయం దిశగా నడిపించారు. ఆఖరి ఓవర్‌ ఐదో బంతి నో బాల్‌ అయింది. అప్పటికి ఈగల్‌ థానే విజయానికి రెండు పరుగులు అవసరం కాగా.. ఓంకార్‌ థర్మాలే సింగిల్‌ తీశాడు.

ఆఖరి బంతికి రనౌట్‌
అయితే ఆఖరి బంతికి అమర్త్య రాజే రనౌట్‌ కావడంతో ఈగల్‌ థానే కథ ముగిసింది. ఆకాశ్‌ టైగర్స్‌ ఒక్క పరుగు తేడాతో గెలిచి సంబరాల్లో మునిగిపోయింది. ఇక మూడు వికెట్లతో చెలరేగి ఈగల్‌ థానే పతనాన్ని శాసించిన శశాంక్‌ అట్రాడేకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

కాగా జూన్‌ 1 నుంచి మొదలైన ముంబై టీ20 లీగ్‌లో నార్త్‌ ముంబై పాంథర్స్‌ రెండింట రెండు గెలిచి నాలుగు పాయింట్లతో టాప్‌లో ఉండగా.. ఆకాశ్‌ టైగర్స్‌కు రెండింట తొలి విజయం.

చదవండి: సూర్యకుమార్‌కు భారీ షాక్‌!

Advertisement
 
Advertisement
Advertisement