టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై వేటుకు రంగం సిద్దమైంది. జూన్, జూలైలో జరగనున్న ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకే ముందే సూర్యకుమార్ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. ఈ ముంబై ఆటగాడు సారథిగా భారత్కు టీ20 ప్రపంచకప్ను అందించినప్పటికి.. అతడి ఫామ్ మాత్రం దారుణంగా పడిపోయింది.
ఒకప్పుడు టీ20 ప్రపంచ నంబర్ వన్గా కొనసాగిన సూర్య.. ఇప్పుడు హాఫ్ సెంచరీ మార్క్ను అందుకోవాడానికి కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్-2026లో అదే తీరును కనబరిచాడు. 13 ఇన్నింగ్స్లలో 270 పరుగులు మాత్రమే చేసి, 2017 తర్వాత సూర్యకుమార్ తన అత్యంత పేలవమైన ఐపీఎల్ సీజన్ను సూర్య చవిచూశాడు.
ఈ క్రమంలోనే అతడి స్దానంలో మరొకరని సారథిగా నియమించాలని బోర్డు భావిస్తోంది. కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గా కూడా అతడిని జట్టు నుంచి తప్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్లతో చర్చలు జరిపిన బీసీసీఐ.. త్వరలోనే కొత్త సారథి పేరును అధికారికంగా ప్రకటించనుంది.
"సెలక్షన్ కమిటీ, బీసీసీఐ, టీమ్ మేనేజ్మెంట్..హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో చర్చించి, ఇకపై టీ20ల్లో భారత జట్టు కొత్త కెప్టెన్తో ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. సూర్య కెప్టెన్సీలో భారత్ టీ20 ప్రపంచకప్ గెలిచినప్పటికి, అతడి ఫామ్, భవిష్యత్తు ప్రణాళికలు దృష్టిలో ఉంచుకుని బోర్డు కొత్త కెప్టెన్ను నియమించేందుకు సిద్దమైంది.
రాబోయే పర్యటనలకు సూర్యకుమార్ను జట్టు సెలెక్షన్కు కూడా పరిశీలించడం లేదు. ఈ విషయాన్ని త్వరలోనే అతనికి స్పష్టం చేస్తాం" అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు 'ది ఇండియన్ ఎక్స్ప్రెస్'తో పేర్కొన్నారు.
కాగా కెప్టెన్సీ రేసులో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లతో పాటు హైదరాబాదీ తిలక్ వర్మ పేరు కూడా వినిపిస్తోంది. తిలక్కు హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా శ్రీలంక పర్యటనలో భారత-ఎ జట్టు కెప్టెన్గా కూడా తిలక్ వ్యవహరించనున్నాడు. త్వరలోనే కొత్త కెప్టెన్ పేరును బీసీసీఐ ఖరారు చేయనుంది.
చదవండి: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన


