3 మ్యాచ్ల వన్డే, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్లో పర్యటించనుంది. జూన్ 9 నుంచి మొదలుకానున్న ఈ పర్యటనలో తొలుత వన్డేలు, ఆతర్వాత టీ20లు జరుగనున్నాయి. వన్డే సిరీస్లోని తొలి 2 మ్యాచ్ల కోసం బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (జూన్ 3) ప్రకటించారు.
స్టార్ ఆల్రౌండర్ మొసద్దెక్ హొసేన్ దాదాపు నాలుగేళ్ల తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. 2022 ఆగస్టులో చివరిసారిగా వన్డే ఆడిన మొసద్దెక్, ప్రస్తుతం జరుగుతున్న ఢాకా ప్రీమియర్ లీగ్లో అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అబాహని లిమిటెడ్ తరఫున ఆడుతున్న అతడు ఆరు ఇన్నింగ్స్ల్లో 77.50 సగటుతో 310 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే ఏడు ఇన్నింగ్స్ల్లో 12 వికెట్లు కూడా పడగొట్టాడు.
మొసద్దెక్తో పాటు నురుల్ హసన్ కూడా గ్యాప్ తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. లిట్టన్ దాస్, నజ్ముల్ హొసేన్ షాంటో, తౌహిద్ హృదోయ్, కెప్టెన్ మెహిది హసన్ మిరాజ్ తదితర బ్యాటర్లు జట్టులో కొనసాగుతున్నారు. బౌలింగ్ విభాగంలో ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, షొరిఫుల్ ఇస్లాం, నహిద్ రాణా వంటి పేసర్లు జట్టులో స్థానం తిరిగి పొందారు.
ఈ సిరీస్లోని వన్డేలు జూన్ 9, 11, 14 తేదీల్లో ఢాకాలోని షేరే బంగ్లా స్టేడియంలో జరుగనున్నాయి. అనంతరం మూడు టీ20లు జూన్ 17, 19, 21 తేదీల్లో చట్టోగ్రామ్లో జరుగనున్నాయి.
ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు బంగ్లాదేశ్ జట్టు..
మెహిది హసన్ మిరాజ్ (కెప్టెన్), సౌమ్య సర్కార్, సైఫ్ హసన్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, లిట్టన్ దాస్, మొసద్దెక్ హొస్సేన్, నూరుల్ హసన్ సోహన్, రిషద్ హుస్సేన్, తన్వీర్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, షొరీఫుల్ ఇస్లాం, నహిద్ రాణా


