టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో యాజమాన్యం తన సేవలను సరిగ్గా వాడుకోలేదని ఆరోపించాడు. కాగా గతేడాది టీమిండియా ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే.
ఈ సిరీస్తోనే భారత జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ తన ప్రయాణం ఆరంభించాడు. గౌతం గంభీర్ మార్గదర్శనంలో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీని టీమిండియా 2-2తో సమం చేసింది. ఇక ఈ సిరీస్లో భాగంగా ముంబైకర్ శార్దూల్ ఠాకూర్ రెండు టెస్టులు ఆడాడు. మొత్తంగా 27 ఓవర్లు బౌలింగ్ చేసి 144 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
లీడ్స్ వేదికగా తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో ఆరు ఓవర్లు వేసిన శార్దూల్.. 38 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్లో 10 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
అదే విధంగా మాంచెస్టర్లో నాలుగో టెస్టులో పదకొండు ఓవర్లు వేసిన శార్దూల్ ఠాకూర్ 55 పరుగులు ఇచ్చి వికెట్లు తీయలేకపోయాడు. ఈ మ్యాచ్ డ్రా అయింది. అయితే, ఈ మూడు ఇన్నింగ్స్లోనూ శార్దూల్ కంటే మిగతా బౌలర్లు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశారు.
ఈ విషయాన్ని శార్దూల్ ఠాకూర్ తాజాగా గుర్తుచేసుకున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ 2026-27 సీజన్ లాంచ్లో భాగంగా మాట్లాడుతూ.. ‘‘2024-25 సీజన్లో నేను అద్భుతంగా ఆడాను (తొమ్మిది మ్యాచ్లలో కలిపి 35 వికెట్లు). కానీ తగినన్ని మ్యాచ్లు ఆడే అవకాశాలు మాత్రం రాలేదు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నపుడు నా సేవల్ని యాజమాన్యం సరిగ్గా ఉపయోగించుకోలేదు.
ఇందులో నా తప్పు కూడా ఉంది. లీడ్స్ టెస్టులో నేను సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. ఒక్క పరుగుకే అవుటయ్యాను. మాంచెస్టర్లో మాత్రం నేను అద్భుతంగా బ్యాటింగ్ చేశాను. తొలి ఇన్నింగ్స్లో 41 పరుగులు చేశాను.
తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 358 పరుగులు చేయగలిగింది. అందులో నా పాత్ర కూడా ఉంది. అయితే, నేను రెండో ఇన్నింగ్స్లో సరిగ్గా ఆడలేదు. ఒకవేళ బాగా ఆడి ఉంటే ఫలితం వేరుగా ఉండేదేమో’’ అని శార్దూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు.


