జడేజా స్ధానంలో అతడికి ఛాన్స్‌ ఇవ్వాల్సింది: ఆకాష్‌ చోప్రా | Mohammed Siraj in, Ravindra Jadeja out for Champions Trophy squad: Aakash Chopra | Sakshi
Sakshi News home page

జడేజా స్ధానంలో అతడికి ఛాన్స్‌ ఇవ్వాల్సింది: ఆకాష్‌ చోప్రా

Jan 20 2025 8:23 PM | Updated on Jan 21 2025 10:17 AM

Mohammed Siraj in, Ravindra Jadeja out for Champions Trophy squad: Aakash Chopra

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ జట్టులో స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చానీయంశమైంది. అతడి స్ధానంలో యువ ఫాస్ట్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌​ సింగ్‌కు సెలక్టర్లు ఛాన్స్‌ ఇచ్చారు.

దీంతో సెలక్టర్ల నిర్ణయాన్ని పలువురు మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఈ జాబితాలో తాజాగా భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా చేరాడు. జడేజా స్ధానంలో సిరాజ్‌కు ఛాన్స్‌ ఇచ్చి ఉంటే జట్టు బౌలింగ్‌ యూనిట్‌ బలంగా ఉండేది అని చోప్రా అభిప్రాయపడ్డాడు. చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గోనే భారత జట్టు..  జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్‌లతో కూడిన బలమైన పేస్ బౌలింగ్‌ ఎటాక్‌ను కలిగింది.

 అయినప్పటికి గత రెండేళ్ల నుంచి వన్డేల్లో అద్బుతంగా రాణిస్తున్న సిరాజ్‌ను జట్టు నుంచి తప్పించడం క్రికెట్‌​ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. గత 43 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 24.04 యావరేజ్‌తో 71 వికెట్లు తీశాడు మహ్మద్ సిరాజ్. 5.18 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. కొన్నాళ్లపాటు వన్డే నెం1 బౌలర్‌గా కూడా సిరాజ్‌ కొనసాగాడు.

"చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గోనే భారత జట్టులో మహ్మద్‌ ‍సిరాజ్‌కు ఛాన్స్‌ ఇవ్వాల్సింది. సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టులో కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా రూపంలో ముగ్గురు లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్లు ఉన్నారు. వారిలో ఒకరిని పక్కన పెట్టాల్సింది. నా వరకు అయితే రవీం‍ద్ర జడేజా స్ధానంలో సిరాజ్‌ను ఎంపిక చేయాల్సింది. 

సిరాజ్‌ జట్టులో ఉండి ఉంటే కొత్త బంతితో అద్బుతంగా బౌలింగ్‌ చేసేవాడు. నిజం చెప్పాలంటే జడేజాకు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి. అటువంటి అతడిని ఎంపిక చేయడం ఎటువంటి లాభం ఉండదు. అదే సిరాజ్‌ను తీసుకుని ఉంటే ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా మారేవాడు" అని చోప్రా తన యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది.

ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (విసి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.
ట్రావెలింగ్‌ రిజర్వ్స్‌: వరుణ్‌ చక్రవర్తి, ఆవేశ్‌ ఖాన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి
చదవండి: చాంపియన్స్ ట్రోఫీ జట్టులో నో ఛాన్స్‌: సిరాజ్‌ కీలక నిర్ణయం!?

Advertisement
 
Advertisement
Advertisement