Ind vs Eng 2nd Test: వాళ్లిద్దరిపై వేటు.. తుదిజట్టులో మార్పులు ఇవే! | Maybe Sai And Karun: Gavaskar on India Playing 11 changes 2nd Test vs Eng | Sakshi
Sakshi News home page

Ind vs Eng 2nd Test: వాళ్లిద్దరిపై వేటు.. తుదిజట్టులో మార్పులు ఇవే!

Jun 25 2025 4:35 PM | Updated on Jun 25 2025 5:18 PM

Maybe Sai And Karun: Gavaskar on India Playing 11 changes 2nd Test vs Eng

టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ వ్యాఖ్యలు

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC) 2025-27 సైకిల్‌ను టీమిండియా ఓటమితో ఆరంభించింది. టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీ (Tendulkar - Andersomn Trophy)లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానం వేదికగా గిల్‌ సేన ఐదు సెంచరీలు బాదినా ఫలితం లేకుండా పోయింది.

ఇద్దరూ విఫలమే
ఫీల్డింగ్‌, బౌలర్ల వైఫల్యం కారణంగా 371 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక ఆతిథ్య జట్టు చేతిలో ఓడింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో స్టోక్స్‌ బృందం 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక తొలి టెస్టులో విఫలమైన ఆటగాళ్లలో ప్రధానంగా ఇద్దరు బ్యాటర్ల పేర్లు చెప్పవచ్చు.

లీడ్స్‌ మ్యాచ్‌ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన చెన్నై యువ ఆటగాడు సాయి సుదర్శన్‌.. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు బంతులు ఎదుర్కొని డకౌట్‌(0)గా వెనుదిరిగాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. 48 బంతుల్లో 30 పరుగులు చేయగలిగాడు. ఈ రెండు సందర్భాల్లోనూ అతడు ఇంగ్లండ్‌ సారథి బెన్‌ స్టోక్స్‌కే వికెట్‌ సమర్పించుకున్నాడు.

మరోవైపు.. ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేసిన కరుణ్‌ నాయర్‌ (Karun Nair) కూడా పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో సాయి మాదిరే డకౌట్‌ అయిన కరుణ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేయగలిగాడు. ఈ నేపథ్యంలో వీరు తదుపరి టెస్టు ఆడే అవకాశాలు సన్నగిల్లవచ్చని టీమిండియా దిగ్గజం, కామెంటేటర్‌ సునిల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

అతడిని తీసు​కోండి
అదే విధంగా.. బౌలింగ్‌ విభాగంలో చేయాల్సిన మార్పుల గురించి కూడా ప్రస్తావిస్తూ.. ‘‘జస్‌ప్రీత్‌ బుమ్రా ఫిట్‌గా ఉన్నాడో లేదో తెలియదు. ఇక తదుపరి మ్యాచ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ను తీసుకువస్తే మంచిది. శార్దూల్‌ ఠాకూర్‌ స్థానంలో అతడిని తీసుకుంటే బెటర్‌. బర్మింగ్‌హామ్‌లో పిచ్‌ మణికట్టు స్పిన్నర్లకు కాస్త సహకరిస్తుంది.

వారిపై వేటు పడవచ్చు
అందుకే కుల్దీప్‌ వస్తే బాగుంటుంది అంటున్నాను. ఒకవేళ కాలం కలిసి రాకపోతే సాయి సుదర్శన్‌, కరుణ్‌ నాయర్‌లపై వేటు పడే అవకాశం ఉంది. నేనైతే ప్రస్తుతానికి వారిని జట్టు నుంచి తప్పించాలని అనుకోవడం లేదు.

ఏదేమైనా స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను జట్టులోకి తీసుకుంటే.. బ్యాటింగ్‌ లైనప్‌ బలపడుతుంది. బౌలింగ్‌ పరంగానూ కాస్త వైవిధ్యం చేకూరుతుంది’’ అని సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ షోలో గావస్కర్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. 

కాగా ఇంగ్లండ్‌- భారత్‌ మధ్య జూలై 2- 6 మధ్య రెండో టెస్టు జరుగనుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ ఇందుకు వేదిక. కాగా ఈ సిరీస్‌లో టీమిండియా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది.

ఇంగ్లండ్‌తో టెస్టులకు భారత జట్టు:
యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సాయి సుదర్శన్‌, శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), కరుణ్‌ నాయర్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌, ధ్రువ్‌ జురెల్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఆకాశ్‌ దీప్‌, హర్షిత్‌ రాణా.
 చదవండి: విధ్వంసకర శతకం, మూడు ఫిఫ్టీలు.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement