
హర్వన్ష్ పంగాలియా (PC: X)
ఇంగ్లండ్లో టీమిండియా ఓటమి చవిచూసిన వేళ.. అండర్-19 క్రికెట్ జట్టు మాత్రం అదరగొట్టింది. ఇంగ్లండ్ యంగ్ లయన్స్తో మంగళవారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో దుమ్ములేపింది. ధనాధన్ బ్యాటింగ్తో దంచికొట్టిన ఆయుశ్ మాత్రే సేన.. నిర్ణీత యాభై ఓవర్లలో ఏకంగా 444 పరుగులు సాధించింది.
భారత జట్టు ఇన్నింగ్స్లో ఏకంగా 26 సిక్సర్లు నమోదు కావడం విశేషం. భారత లోయర్ మిడిల్ ఆర్డర్ ఈ మేరకు చెలరేగడం విశేషం. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన 18 ఏళ్ల హర్వన్ష్ పంగాలియా (Harvansh Pangalia) సెంచరీతో కదం తొక్కాడు.
52 బంతుల్లోనే 103 పరుగులు
కేవలం 52 బంతుల్లోనే 103 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఎనిమిది ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి. మిగిలిన వాళ్లలో రాహుల్ కుమార్, కనిష్క్ చౌహాన్ ఆర్ఎస్ అంబరిష్ అర్ధ శతకాలతో మెరిశారు. రాహుల్ 60 బంతుల్లో 73, కనిషష్క్ 67 బంతుల్లో 79 పరుగులు చేయగా.. అంబరిష్ 47 బంతుల్లో 72 రన్స్తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
తేలిపోయిన ఆయుశ్, వైభవ్
లాబొరో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఐపీఎల్ యువ సంచలనాలు కెప్టెన్ ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మాత్రం ఈ మ్యాచ్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఆయుశ్ ఒక్క పరుగే చేయగా.. కేవలం 17 పరుగులు చేసి వైభవ్ పెవిలియన్ చేరాడు. కాగా ఇంగ్లండ్ బౌలర్లలో మ్యానీ లమ్స్డన్ నాలుగు వికెట్లు తీయగా.. మాథ్యూ ఫిబ్రాంక్ మూడు వికెట్లు పడగొట్టాడు.
ఈ క్రమంలో భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ యంగ్ లయన్స్ను భారత బౌలర్లు 211 పరుగులకే కట్టడి చేశారు. దీపేశ్ దేవేంద్రన్ మూడు వికెట్లతో మెరవగా.. నమన్ పుష్పక్, విహాన్ మల్హోత్రా రెండేసి వికెట్లు తీశారు. ఇక ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ విల్ బెన్నిసన్ సెంచరీతో అలరించాడు.
231 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చిత్తు
అయితే, అతడికి మిగిలిన ఆటగాళ్ల నుంచి సహకారం లేకపోవడంతో భారత్ చేతిలో ఇంగ్లండ్ 231 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. కాగా జూన్ 27 నుంచి జూలై 23 వరకు భారత అండర్-19 జట్టుకు ఇంగ్లండ్ లయన్స్ మధ్య ఐదు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.
ఇక భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన హర్వన్ష్ గంధిగామ్కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్. గుజరాత్లోని రాణా ఆఫ్ కచ్కు చెందిన చిన్న పట్టణం నుంచి వచ్చాడు. అతడి కుటుంబం ప్రస్తుతం కెనడాలో సెటిలైంది. హర్వన్ష్ తండ్రి బ్రాంప్టన్లో ట్రక్కు డ్రైవర్గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా తొలి టెస్టులో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్ల సిరీస్లో లీడ్స్ వేదికగా ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయిన గిల్ సేన.. 0-1తో వెనుబడి ఉంది.
ఇంగ్లండ్ పర్యటనకు భారత అండర్-19 జట్టు ఇదే
ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), హర్వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహ, ప్రణవ్ రాఘవేంద్ర, మొహ్మద్ ఇనాన్, ఆదిత్య రానా, అన్మోల్జీత్ సింగ్.
స్టాండ్ బై ప్లేయర్లు: నమన్ పుష్కక్, డి. దీపేశ్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారి, అలంకృత్ రాపోలే (వికెట్ కీపర్).
చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్