
బొమ్మదేవర ధీరజ్ కూడా అర్హత
స్టార్ ఆర్చర్లు మధుర, అతాను దాస్, అభిషేక్ వర్మలకు చుక్కెదురు
పుణే: స్టార్ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, బొమ్మదేవర ధీరజ్ (ఆంధ్రప్రదేశ్), తనిపర్తి చికిత (తెలంగాణ) ప్రపంచ కప్ స్టేజ్–4 టోర్నీ, ప్రపంచ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికయ్యారు. భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించిన జాతీయ సెలక్షన్ ట్రయల్స్లో పలువురు స్టార్ ఆర్చర్లకు నిరాశ ఎదురైంది. ఒలింపియన్ అతాను దాస్, ప్రపంచ ఏడో ర్యాంకర్ అభిషేక్ వర్మ, ఈ ఏడాది ప్రపంచకప్ టోర్నీల్లో మూడు పతకాలు నెగ్గిన మధుర ట్రయల్స్లో విఫలమయ్యారు.
ఆశ్చర్యకరంగా టీనేజ్ ఆర్చర్లు ‘ప్రపంచ’ పోటీలకు అర్హత సాధించడం విశేషం! 15 ఏళ్ల మహారాష్ట్ర ఆర్చర్లు గత ఖడకే, శర్వారీ మహిళల రికర్వ్ లో ... 16 ఏళ్ల ప్రీతిక మహిళల కాంపౌండ్లో భారత జట్టుకు ఎంపికయ్యారు. మహిళల కాంపౌండ్లో జ్యోతి సురేఖ (18.25 పాయింట్లు), పర్ణీత్ (14), ప్రీతిక (12.25) వరుసగా తొలి మూడు స్థానాలు పొందారు. చికిత (12.25) కూడా ప్రీతికతో సమవుజ్జీగా నిలిచినప్పటికీ ‘షూటాఫ్’తో చికిత నాలుగో స్థానానికి పరిమితమైంది.
అయితే ఈ ప్రదర్శనతో ఆమె ప్రపంచకప్ ఈవెంట్కు అర్హత పొందగా... టాప్–3 ప్లేయర్లు రెండు మెగా ఈవెంట్లకూ క్వాలిఫై అయ్యారు. పురుషుల రికర్వ్లో అతాను దాస్ అర పాయింట్ (0.5) తేడాతో ప్రపంచ పోటీలకు దూరమయ్యాడు. ప్రపంచ కప్ స్టేజ్–4 ఈవెంట్ వచ్చే నెల 8 నుంచి 13 వరకు మాడ్రిడ్లో జరుగుతుంది. ప్రపంచ చాంపియన్ షిప్ను సెపె్టంబర్ 5 నుంచి 12 వరకు దక్షిణ కొరియాలో నిర్వహిస్తారు.