
Photo Courtesy: BCCI
ఆర్సీబీ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ యశ్ దయాల్ చెన్నై సూపర్ కింగ్స్ నోటి కాడి గెలుపును లాగేసుకున్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 3) జరిగిన మ్యాచ్లో ఇది జరిగింది. ఆర్సీబీ నిర్దేశించిన 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ సీఎస్కే విజయం దిశగా సాగుతుండింది. చివరి ఓవర్లో ఆ జట్టు గెలుపుకు 15 పరుగులు కావాలి. ఈ దశలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ యశ్ దయాల్కు బంతినందించాడు.
దయాల్ కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా 15 పరుగులను విజయవంతంగా కాపాడుకున్నాడు. క్రీజ్లో ధోని, జడేజా, దూబే ఉన్నా ఏమీ చేయలేకపోయారు.
తొలి రెండు బంతులకు రెండు సింగిల్స్ ఇచ్చిన దయాల్.. మూడో బంతికి ధోనిని ఔట్ చేశాడు. ఆ తర్వాత నాలుగో బంతికి దూబే సిక్సర్ బాదగా, అది కాస్త నో బాల్ అయ్యింది. దీంతో ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. సీఎస్కే గెలుపు చివరి మూడు బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే కావాలి. క్రీజ్లో దూబే, జడేజా ఉన్నారు. ఈ దశలో సీఎస్కే గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు.
అయితే దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి చివరి మూడు బంతులకు మూడు సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. దీంతో సీఎస్కే 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దయాల్ గత సీజన్లోనూ ఇలాగే సీఎస్కే నోటి కాడి గెలుపును లాగేసుకున్నాడు. ఆ మ్యాచ్లోనూ దయాల్ చివరి ఓవర్ను అద్భుతంగా బౌలింగ్ చేసి 16 పరుగులను విజయవంతంగా కాపాడుకున్నాడు.
ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్కే ఈ ఓటమితో చివరి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. చివరి మ్యాచ్ల్లోనైనా గెలిచి పరువు కాపాడుకుందామనుకుంటే దయాల్ ఈ మ్యాచ్లో సీఎస్కేను దెబ్బకొట్టాడు. సీఎస్కే ఈ సీజన్లో మరో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపుగా ఖరారైపోయినట్లే.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. జేకబ్ బేతెల్ (55), విరాట్ కోహ్లి (62), రొమారియో షెపర్ట్ (53 నాటౌట్) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్లో ఆర్సీబీ మధ్యలో కాస్త తడబడినా, ఆఖర్లో షెపర్ట్ సునామీలా విరుచుకుపడి భారీ స్కోర్ అందించాడు. షెపర్డ్ కేవలం 14 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఈ హాఫ్ సెంచరీ ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైంది.
సీఎస్కే బౌలర్లలో పతిరణ (4-0-36-3), నూర్ అహ్మద్ (4-0-26-1) అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ.. ఖలీల్ అహ్మద్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఖలీల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 33 పరుగులు పిండుకున్నాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే ఆదిలో నిదానంగా ఆడినా.. ఆ తర్వాత గేర్ మార్చింది. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఆయుశ్ మాత్రే చెలరేగిపోయాడు. ఆ ఓవర్లో 5 ఫోర్లు, సిక్సర్ సహా 26 పరుగులు రాబట్టాడు. ఆతర్వాత కూడా జోరు కొనసాగించిన మాత్రే సీఎస్కేను విజయతీరాలు దాటించే ప్రయత్నంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఔటయ్యాడు.
ఈ ఇన్నింగ్స్లో మాత్రే 48 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి తృటిలో సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. మరో ఎండ్లో రవీంద్ర జడేజా కూడా చెలరేగడంతో ఈ సీజన్లో సీఎస్కే తొలిసారి అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. జడేజా 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి తమ జట్టుకు గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. ఈ మ్యాచ్లో సీఎస్కేకు టర్నింగ్ పాయింట్ డెవాల్డ్ బ్రెవిస్ వికెట్.
ఆయుశ్ మాత్రే ఔటైన మరుసటి బంతికే బ్రెవిస్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అంపైర్ నిర్ణయం డౌట్ ఫుల్గా ఉన్నా బ్రెవిస్ నిర్ణీత సమయంలో రివ్యూ తీసుకోకుండా లేట్ చేశాడు. తీరా రివ్యూలో చూస్తే అతడు నాటౌట్ అని తేలింది. ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్న బ్రెవిస్ చివరి వరకు క్రీజ్లో ఉండి ఉంటే సీఎస్కే తప్పక గెలిచేది.
చివరి ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో సీఎస్కే లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. జడేజా 77, శివమ్ దూబే 8 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. సీజన్లో తొలిసారి భువీ వికెట్ లేకుండా అత్యంత ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు (4-0-55-0).