
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చాలా మంది క్రికెటర్లు తాము తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్నారు. వీరిలో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ముందు వరుసలో ఉన్నాడు. ఈ సీజన్ వేలంలో లక్నో పంత్ను రూ. 27 కోట్ల రికార్డు ధర చెల్లించి సొంతం చేసుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర. ఇంత భారీ మొత్తం పెట్టినా ఈ సీజన్లో పంత్ దారుణంగా విఫలమవుతున్నాడు. 8 మ్యాచ్ల్లో నామమాత్రపు స్ట్రయిక్రేట్తో (98.15) కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 106 పరుగులు మాత్రమే చేశాడు.
ఈ సీజన్లో లభించిన మొత్తానికి న్యాయం చేయలేకపోతున్న రెండో ఆటగాడు వెంకటేశ్ అయ్యర్. వెంకటేశ్ అయ్యర్ను కేకేఆర్ ఈ సీజన్ మెగా వేలంలో రూ. 23.75 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే వెంకటేశ్ జట్టు తనపై పెట్టుకున్న అంచనాలకు కనీస న్యాయం చేయలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో నామమాత్రపు ప్ట్రయిక్రేట్తో ఒకే ఒక హాఫ్ సెంచరీ చేసి 121 పరుగులు చేశాడు.
ఈ సీజన్లో తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేని మూడో ఆటగాడు మహ్మద్ షమీ. షమీని ఈ సీజన్ మెగా వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఎంతో నమ్మకంతో రూ. 10 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అతను 7 మ్యాచ్లు ఆడి 5 వికెట్లు మాత్రమే తీశాడు.
ఈ సీజన్లో చెత్త ప్రదర్శనలతో ఉసూరుమనిపిస్తున్న మరో క్రికెటర్ రషీద్ ఖాన్. రషీద్ను గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ మెగా వేలానికి ముందు రూ. 18 కోట్లకు రీటైన్ చేసుకుంది. అయితే రషీద్ ఎన్నడూ లేనట్లుగా ఈ సీజన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఒక్క మ్యాచ్లో కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. రషీద్ ఈ సీజన్లో 7 మ్యాచ్ల్లో కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. అతని ఎకానమీ (9.73) కూడా చాలా దారుణంగా ఉంది.
ఈ సీజన్లో అంచనాలు తగ్గట్టుగా రాణించలేని మరో క్రికెటర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్. ఇతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ భారీ అంచనాలు పెట్టుకుని మెగా వేలంలో రూ. 9 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఇతగాడు ఆడిన 6 మ్యాచ్ల్లో 105.77 స్ట్రయిక్రేట్తో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు గుండు సున్నాలు ఉన్నాయి.
పైన పేర్కొన్న ఆటగాళ్లతో పాటు మరికొందరు కూడా తీసుకున్న మొత్తానికి న్యాయం చేయలేకపోతున్నారు. వారిలో లివింగ్స్టోన్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, క్లాసెన్, ట్రవిస్ హెడ్, ఆండ్రీ రసెల్, హెట్మైర్, రబాడ, జన్సెన్ లాంటి విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. టి నటరాజన్ (10.75 కోట్లు, ఢిల్లీ) లాంటి ఆటగాళ్లు భారీ మొత్తం లభించినా అవకాశాలు లేక బెంచ్కే పరిమితమవుతున్నారు.
ఇదిలా ఉంటే, కొందరు దేశీయ ఆటగాళ్లు మాత్రం ఈ సీజన్లో అంచనాలకు మించి తీసుకున్న డబ్బుకు న్యాయం చేస్తున్నారు. వీరిలో ప్రియాంశ్ ఆర్య (3.8 కోట్లు), అశుతోష్ శర్మ (3.8 కోట్లు), దిగ్వేశ్ రాఠీ (30 లక్షలు), విప్రాజ్ నిగమ్ (50 లక్షలు), అనికేత్ వర్మ (30 లక్షలు), వైభవ్ సూర్యవంశీ (1.1 కోట్లు), ఆయుశ్ మాత్రే లాంటి ఆటగాళ్లు ఉన్నారు.