
Photo Courtesy: BCCI
చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు) వేదికగా ఆర్సీబీతో ఇవాళ (ఏప్రిల్ 2) జరిగిన మ్యాచ్లో గుజరాత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి గుజరాత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. లివింగ్స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
మధ్యలో జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్) కూడా ఓ మోస్తరుగా బ్యాట్ ఝులిపించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో వీరు మినహా ఎవరూ రాణించలేదు. సాల్ట్ 14, విరాట్ కోహ్లి 7, పడిక్కల్ 4, పాటిదార్ 12, కృనాల్ పాండ్యా 5 పరుగులు చేసి ఔటయ్యారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీయగా.. సాయికిషోర్ 2, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, ఇషాంత్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.
170 పరుగుల నామ మాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) గుజరాత్ను గెలిపించారు.
తొలుత నిదానంగా ఆడిన బట్లర్.. ఆతర్వాత గేర్ మార్చి ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆఖర్లో రూథర్ఫోర్డ్ (ఇంపాక్ట్ ప్లేయర్) తనదైన శైలితో చెలరేగిపోయాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. టాప్ ప్లేస్లో ఉండిన ఆర్సీబీ మూడో స్థానానికి పడిపోయింది.