IPL 2022 Auction- Chahal, Rahul, Shardul Funny Video: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 12, 13 తేదీలలో వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఫ్రాంఛైజీలు రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించగా.... కొత్తగా ఎంట్రీ ఇస్తున్న లక్నో, అహ్మదాబాద్ సైతం తాము ఎంచుకున్న ముగ్గురు ఆటగాళ్ల పేర్లను వెల్లడించాయి. లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ను తమ సారథిగా ఎంపిక చేసుకోగా.. అహ్మదాబాద్ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించనుంది.
ఇక రాహుల్ కోసం గోయెంకా గ్రూపు నేతృత్వంలోని లక్నో జట్టు భారీగానే ఖర్చు చేసిన విషయం తెలిసిందే. సుమారు 17 కోట్ల రూపాయలు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చహల్, రాహుల్ మధ్య జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. మెగా వేలం గురించి ప్రస్తావించిన శార్దూల్.... తనకోసం లక్నో ఫ్రాంఛైజీ వెచ్చించగల బడ్జెట్ ఎంత అంటూ రాహుల్ను ప్రశ్నించాడు.
ఇందుకు స్పందించిన రాహుల్... బేస్ ప్రైస్(కనీస ధర) అంటూ సమాధానమిచ్చాడు. ఇంతలో ఈ విషయంలో జోక్యం చేసుకున్న చహల్.. ‘‘దేవుడికి(లార్డ్) కూడా బడ్జెట్ కేటాయించగల మనుషులు ఉంటారా’’ అంటూ తనదైన శైలిలో కామెంట్ చేశాడు. ఓ హోటల్లో ఈ సరదా సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్-2021 సీజన్లో చెన్నై సూపర్కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన ‘లార్డ్’ శార్దూల్ ఠాకూర్ జట్టును విజేతగా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, రిటెన్షన్ నిబంధనల నేపథ్యంలో నలుగురిని రిటైన్ చేసుకున్న చెన్నై అతడిని వదిలేసింది. దీంతో శార్దూల్ వేలంలోకి రానున్నాడు.
ఇక ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా రెండో మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ 7 వికెట్లతో చెలరేగి అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. లార్డ్ అన్న ట్యాగ్ విషయానికొస్తే... ఆస్ట్రేలియా పర్యటన అనంతరం స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ సందర్భంగా శార్దూల్ పేరు బాగా పాపులర్ అయ్యింది. ఆ సిరీస్లో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. అప్పటి నుంచే తన పేరు లార్డ్ శార్ధూల్ ఠాకూర్గా మారిపోయిందని ఈ యువ ఆటగాడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
చదవండి: IPL 2022 Mega Auction: చెన్నై చేరుకున్న ధోని.. టార్గెట్ అదేనా!
India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి