క్లీన్‌స్వీప్‌ తప్పించుకోవాలని... | Indias last ODI against Australia womens team today | Sakshi
Sakshi News home page

క్లీన్‌స్వీప్‌ తప్పించుకోవాలని...

Dec 11 2024 4:07 AM | Updated on Dec 11 2024 4:07 AM

Indias last ODI against Australia womens team today

నేడు ఆస్ట్రేలియా మహిళల జట్టుతో భారత్‌ చివరి వన్డే

ఉదయం గం. 9:50 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం  

పెర్త్‌: ఇప్పటికే ఆ్రస్టేలియా చేతిలో వన్డే సిరీస్‌ కోల్పోయిన భారత మహిళల జట్టు నేడు ఆఖరి వన్డే బరిలోకి దిగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి రెండు వన్డేల్లోనూ ఓడిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత జట్టు... బుధవారం పెర్త్‌ వేదికగా చివరి మ్యాచ్‌లో ఆ్రస్టేలియాతో పోటీపడనుంది. ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ నెగ్గిన టీమిండియా... ఆసీస్‌ చేతిలో క్లీన్‌స్వీప్‌ తప్పించుకోవాలని ప్రయతి్నస్తోంది. 

వచ్చే ఏడాది భారత్‌లో వన్డే ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో మెగా టోర్నీకి ముందు... ఆఖరి వన్డేలో నెగ్గి హర్మన్‌ బృందం ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంటుందా చూడాలి. గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ్రస్టేలియా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చగా... భారత జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఘోర ప్రదర్శన కనబర్చింది. సీనియర్‌ ప్లేయర్లు హర్మన్‌ప్రీత్‌ కౌర్, స్మృతి మంధాన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోగా... మిగిలిన వాళ్లు కూడా సత్తా చాటడం లేదు. దీంతో బ్యాటింగ్‌ వైఫల్యం జట్టును దెబ్బ తీస్తోంది. 

ఇక చివరి మ్యాచ్‌లోనైనా టీమిండియా కలిసికట్టుగా కదంతొక్కాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. వరల్డ్‌కప్‌నకు ముందు బ్యాటింగ్‌ కూర్పునకు ఈ సిరీస్‌ ఉపయోగపడుతుందని భావించగా... అదీ సాధ్యపడలేదు. ఫామ్‌ కోల్పోయి జట్టుకు దూరమైన యువ ఓపెనర్‌ షఫాలీ వర్మ స్థానంలో ఎవరిని ప్రయత్నించినా... ముద్ర వేయలేకపోగా... మిడిలార్డర్‌లో జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్‌ మినహా తక్కిన వాళ్లెవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు. గ

త రెండు మ్యాచ్‌ల్లో కలిపి ఆసీస్‌ ప్లేయర్లు 2 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు నమోదు చేస్తే... భారత్‌ నుంచి అత్యధికంగా రిచా ఘోష్‌ మాత్రమే ఒక హాఫ్‌ సెంచరీ చేసింది. రెండో వన్డే ఓటమి అనంతరం హర్మన్‌ప్రీత్‌ మాట్లాడుతూ... ‘ఎక్కువ సేపు క్రీజులో నిలవడంపై దృష్టి పెట్టాలి. మొత్తం 50 ఓవర్లు ఆడటంతో పాటు... బౌలింగ్‌లోనూ భిన్నమైన ప్రణాళికలు అమలు చేయాలి’ అని చెప్పింది. మరి మూడో మ్యాచ్‌లోనైనా అలాంటి ప్రయత్నం చేస్తారా చూడాలి. 

మరోవైపు సీనియర్‌ ప్లేయర్లు అందుబాటులో లేకపోయినా... ఆసీస్‌ అమ్మాయిలు అదరగొడుతున్నారు. ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన జార్జియా వోల్‌... భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబడుతోంది. ఆ తెగింపు మన ప్లేయర్లు కూడా కనబర్చాల్సిన అవసరముంది. 

6 ఇప్పటి వరకు ఆ్రస్టేలియాతో మూడు లేదా అంతకంటే ఎక్కువ వన్డేలతో కూడిన ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత జట్టు ఆరుసార్లు (1984లో 0–4తో; 2006లో 0–3తో; 2008లో 0–5తో; 2012లో 0–3తో; 2018లో 0–3తో; 2023లో 0–3తో) క్లీన్‌స్వీప్‌ అయింది.   

Advertisement
 
Advertisement
Advertisement