నేడు ఆస్ట్రేలియా మహిళల జట్టుతో భారత్ చివరి టి20
మధ్యాహ్నం గం. 1:45 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియోహాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం
అడిలైడ్: పొట్టి ఫార్మాట్లో మిగిలిపోయిన ఆఖరి పోరులో గట్టిగా పోరాడి పైచేయి సాధించేందుకు భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్లు ‘సై’ అంటున్నాయి. ఇరుజట్ల మధ్య శనివారం ఇక్కడ ఆఖరి టి20 మ్యాచ్ జరుగనుంది. ఈ ఒక్క టి20లకే పరిమితం కాని ఈ పర్యటనలో సిరీస్ గెలవాలంటే ఇంకా రెండు ఫార్మాట్లలోనూ సత్తా చాటాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుత టి20ల్లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచి 1–1తో సమంగా నిలిచాయి.
నేడు జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు ఓవరాల్ సిరీస్లో 4–2 పాయింట్లతో (మ్యాచ్ విజేతకు 2 పాయింట్లు) ఆధిక్యం సంపాదిస్తుంది. దీంతో తదుపరి మూడు వన్డేలు, ఏకైక టెస్టు సిరీస్లకు కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకోవచ్చు. ప్రస్తుతం హర్మన్ప్రీత్ సారథ్యంలోని టీమిండియా లక్ష్యం కూడా సిరీస్ కాదు... నేటి మ్యాచ్ విజయమే! ఇదే జట్టులో స్థయిర్యాన్ని పెంచుతుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
బ్యాటర్లదే భారం
తొలి మ్యాచ్లో వర్షంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో నెగ్గిన హర్మన్ బృందం... పూర్తిస్థాయిలో జరిగిన రెండో టి20లో చేతులెత్తేసింది. ఆతిథ్య ఆసీస్ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ హర్మన్ప్రీత్, వైస్ కెపె్టన్ స్మృతి మంధాన ఇద్దరే 30 పైచిలుకు పరుగులు చేస్తే... ప్రధాన బ్యాటింగ్ బలం క్రీజులోకి దిగిన వారంతా ఆసీస్ బౌలింగ్కు దాసోహమయ్యారు.
అదే ఈ మ్యాచ్లో పునరావృతం చేస్తే వన్డే సిరీస్కు ముందే టీమిండియా వెనుకబడిపోతుంది. ఇది మరింత ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి టాపార్డర్, మిడిలార్డర్ మరింత బాధ్యతగా ఆడాలి. అప్పుడే ఈ సుదీర్ఘ ఓవరాల్ సిరీస్ (టి20, వన్డే, టెస్టు)లో భారత్ పుంజుకోగలుగుతుంది. లేదంటే పరాజయాలతో, పాయింట్లతో ఆఖరికి మూల్యం చెల్లించు కోవాల్సి ఉంటుంది.
జెమీమా రోడ్రిగ్స్, హిట్టర్లు రిచా ఘోష్, అమన్జోత్లు దంచేసే పనిలో ముందుంటే భారత్ కూడా ఈ ఓవరాల్ సిరీస్లో ముందంజ వేస్తుంది. బ్యాటర్లతో పోల్చితే రేణుక, క్రాంతి, అరుంధతి రెడ్డి, దీప్తి శర్మ, నల్లపురెడ్డి శ్రీచరణిలు బౌలింగ్లో కాస్త మెరుగ్గానే రాణిస్తున్నారు. మరోవైపు ఫామ్లోకి వచి్చన ఆతిథ్య జట్టు వరుసగా ఈ మ్యాచ్లోనూ రాణించి పైచేయి సాధించాలని ఆశిస్తోంది.


