దేశవాళీ క్రికెట్లో ఆఖిబ్ నబీ జోరు
అద్భుత ప్రదర్శనలతో చెలరేగుతున్న పేసర్
దాదాపు ఆరు నెలల క్రితం... నార్త్జోన్, ఈస్ట్జోన్ మధ్య దులీప్ ట్రోఫీ మ్యాచ్... నార్త్కు ప్రాతినిధ్యం వహిస్తున్న జమ్మూ కశ్మీర్ పేస్ బౌలర్ ఆఖిబ్ నబీ సంచలన ప్రదర్శనతో అదరగొట్టాడు. ‘హ్యాట్రిక్’ సహా నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసి ఈస్ట్ను కుప్పకూల్చాడు. తన 30వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్లోనే అతను 9వసారి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ‘భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడటమే నా లక్ష్యం’ అని ఆఖిబ్ అప్పుడే చెప్పుకున్నాడు.
వరుసగా రెండు సీజన్లలో నబీ వికెట్లు పడగొట్టిన తీరు, అతని ఓవరాల్ ప్రదర్శన చూస్తే ఆ రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. తాజాగా రంజీ సీజన్లో కూడా పలువురుసీనియర్లు, మాజీల అభిప్రాయం ప్రకారం భారత్ తమ తర్వాతి టెస్టు మ్యాచ్ను ఎప్పుడు ఆడినా... నిస్సందేహంగా అందులో నబీకి అవకాశం కల్పించవచ్చు. 29 ఏళ్ల వయసులో ఈ పేసర్కు టీమిండియా అవకాశం వస్తేనే అతని నిలకడైన ప్రదర్శనకు గుర్తింపు దక్కినట్లుగా భావించవచ్చు.
సాక్షి క్రీడా విభాగం : జమ్మూ కశ్మీర్ తమ 67 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఇప్పుడు ఫైనల్కు చేరింది. గత ఏడాది కూడా చక్కటి ప్రదర్శనతో నాకౌట్ దశకు అర్హత సాధించింది. అయితే అనుభవలేమితో ముందంజ వేయడంలో కశ్మీర్ విఫలమైంది. ఈ రెండు సీజన్లలో కూడా వారి విజయ గాథలో ఒకే ఒక్క ఆటగాడు బలంగా కనిపిస్తాడు. అతనే ఆఖిబ్ నబీ.
2024–25 సీజన్లో 8 మ్యాచ్లలో కలిపి నబీ కేవలం 13.93 సగటుతో 44 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. స్పిన్నర్ హర్ష్ దూబే (69) మినహాయిస్తే పేసర్లలో అతనిదే అగ్రస్థానం. ఈసారి కూడా దాదాపు అదే తరహా ప్రదర్శనతో అతను ఆకట్టుకున్నాడు. 9 మ్యాచ్లలో కలిపి కేవలం 12.72 సగటుతో నబీ 55 వికెట్లు తీయడం విశేషం.
ఇప్పుడు కూడా స్పిన్నర్ మయాంక్ మిశ్రా (59) కాకుండా పేస్ బౌలర్గా నబీ మొదటి స్థానంలో నిలిచాడు. తాజా సీజన్లో అతను ఏకంగా 6 సార్లు ఇన్నింగ్స్లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. మరోవైపు బ్యాటింగ్లో కూడా అతను తగ్గలేదు. 2 అర్ధసెంచరీలు సహా 243 పరుగులు నమోదు చేసి కీలక సమయాల్లో జట్టుకు అండగా నిలిచాడు.
ఫుట్బాల్ నుంచి క్రికెట్ వైపు...
క్రికెట్కు సంబంధించి బొటాబొటీ సౌకర్యాలు మాత్రమే ఉన్న బారాముల్లా పట్టణం నబీ స్వస్థలం. అక్కడి నుంచి 50 కిలో మీటర్ల దూరంలో శ్రీనగర్ ఉంటుంది. అత్యుత్తమ స్థాయి క్రికెట్ ప్రాక్టీస్ కావాలంటే ఎవరైనా శ్రీనగర్కు వెళ్లాల్సిందే. ‘కెరీర్లో ఎదగాలంటే ఇలాంటి విషయాలు పట్టించుకోకుండా కష్టపడాలి. పరిమిత వనరులనే వాడుకోవాలి తప్ప ఫిర్యాదులు చేయకూడదు. దేశం కోసం ఆడాలంటే దేనికైనా సిద్ధపడాలి’ అని కెరీర్ ఆరంభంలో చెప్పిన నబీ దానికి తగినట్లుగా తనను తాను మలచుకుకున్నాడు.
కశ్మీర్లో స్థానికంగా కనిపించే పరిస్థితులను బట్టి ఆరంభంలో నబీ ఫుట్బాల్ను ఎంచుకున్నాడు. అయితే వేగాన్ని అమితంగా ఇష్టపడే అతని నైజం చివరకు పేస్ బౌలింగ్ వైపు మార్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన తండ్రి నబీకి ఆటలో అన్ని విధాలా అండగా నిలిచాడు. అవుట్స్వింగర్ ప్రధాన బలమైన నబీ తన ప్రతిభను మరింత తీర్చిదిద్దుకునేందుకు కెరీర్ ఆరంభంలో బెంగళూరుకు వెళ్లాడు.
ఒక మిత్రుడు సహాయం అందించడంతో స్థానికంగా కర్ణాటక లీగ్లో చింతామణి క్లబ్ తరఫున మూడు నెలలు ఆడి ఆ టీమ్ తర్వాతి సీజన్లో ఫస్ట్ డివిజన్కు ప్రమోట్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. బెంగళూరులో ఆడిన ఆట తనకు ఎంతో మేలు చేసిందని, పెద్ద స్థాయిలో కూడా సత్తా చాటగలననే ఆత్మవిశ్వాసం అందించిందని నబీ చెప్పాడు.
ముంబైతో మ్యాచ్లో చెలరేగి...
జార్ఖండ్తో ఆడిన తన తొలి రంజీ మ్యాచ్లోనే ఐదు వికెట్లు పడగొట్టడంతో నబీ గురించి అందరికీ తెలిసింది. అయితే అదే సీజన్లో కర్ణాటకతో మ్యాచ్లో ఒక చక్కటి బంతితో కరుణ్ నాయర్ను అవుట్ చేయడంతో అందరి దృష్టీ అతనిపై పడింది. ఇక సీనియర్ పర్వేజ్ రసూల్ ప్రోత్సాహం, భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మార్గనిర్దేశనంలో నబీ బౌలింగ్ మరింత పదునెక్కింది. గత సీజన్లో ముంబైతో జరిగిన మ్యాచ్ నిస్సందేహంగా అతని స్థాయిని పెంచింది.
42 సార్లు చాంపియన్ అయిన ముంబైని ఓడించడం ఒక ఘనత కాగా... ఈ మ్యాచ్లో నబీ 6 వికెట్లు పడగొట్టాడు. రోహిత్ శర్మ కూడా ఆడిన ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, శార్దుల్ ఠాకూర్లను నబీ అవుట్ చేశాడు. తాజా సీజన్లోనైతే క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్పై 12 వికెట్లు, సెమీస్ లో బెంగాల్పై 9 వికెట్లు... రెండు నాకౌట్ మ్యాచ్లలోనూ అతనే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కావడం విశేషం.
ఇదే జోరు కొనసాగించే తన టీమ్ను తొలిసారి రంజీ చాంపియన్గా నబీ నిలుపుతాడా అనేది ఆసక్తికరం. మరోవైపు హుబ్లీలో కర్ణాటకతో జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం పేస్కు ఏమాత్రం అనుకూలించని పిచ్ను తయారు చేసి నబీ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే... మైదానంలోకి దిగకముందే అతని ప్రభావం కనిపించడం నిజంగా నబీకి లభించిన పెద్ద అవార్డుగా చెప్పవచ్చు.
రూ.8.40 కోట్లతో...
ఐపీఎల్లో గత కొన్నేళ్లుగా వరుసగా తన పేరు రావడం, ఎవరో పట్టించుకోకపోవడం అలవాటుగా మారిపోయిందని 2026 సీజన్ వేలానికి ముందు నబీ వ్యాఖ్యానించాడు. అయితే ఈసారి తన ప్రదర్శన చూస్తే కొంత నమ్మకం కలుగుతోందని కూడా అతను చెప్పాడు. చివరకు నబీ నమ్మకం నిజమైంది. ఏకంగా రూ.8.40 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలో నబీని తీసుకుంది.
ఇన్నేళ్ల శ్రమకు అతనికి భారీ మొత్తంతో గుర్తింపు దక్కింది. ఏడేళ్ల దేశవాళీ కెరీర్లో నబీ 40 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 151 వికెట్లు పడగొట్టాడు. అతని సగటు 18.62 మాత్రమే కావడం చెప్పుకోదగ్గ అంశం. వీటిలో మ్యాచ్లో 10 వికెట్ల ప్రదర్శనలు నాలుగు ఉన్నాయి. 36 వన్డేల్లో 56...34 టి20ల్లో అతను 43 వికెట్లు తీశాడు.


