వైజాగ్ టి20లో భారత్ పరాజయం
50 పరుగులతో న్యూజిలాండ్ గెలుపు
శివమ్ దూబే మెరుపులు వృథా
తిరువనంతపురంలో శనివారం చివరి టి20
టి20 సిరీస్లో వరుసగా మూడు అద్భుత ప్రదర్శనల తర్వాత భారత జట్టు విశాఖ తీరంలో న్యూజిలాండ్ ముందు తలవంచింది. 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి బంతికే అభిషేక్ శర్మ అవుట్తో మొదలైన ఇన్నింగ్స్ చివరకు ఓటమితో ముగిసింది. 15 బంతుల అర్ధ సెంచరీతో శివమ్ దూబే పోరాడినా... దురదృష్టవశాత్తూ అతని నిష్క్రమణతో ఓటమి ఖాయమైంది. సీఫెర్ట్, కాన్వే, సాంట్నర్ల మెరుగైన ప్రదర్శనతో ఎట్టకేలకు సిరీస్లో తొలి గెలుపుతో కివీస్కు కాస్త ఊరట దక్కింది.
సాక్షి, విశాఖపట్నం: న్యూజిలాండ్తో టి20 సిరీస్లో టీమిండియాకు తొలి పరాజయం ఎదురైంది. సిరీస్ గెలుచుకున్న తర్వాత బుధవారం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన నాలుగో మ్యాచ్లో కివీస్ 50 పరుగుల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.
టిమ్ సీఫెర్ట్ (36 బంతుల్లో 62; 7 ఫోర్లు, 3 సిక్స్లు), డెవాన్ కాన్వే (23 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్లు) తొలి వికెట్కు 50 బంతుల్లోనే 100 పరుగులు జోడించగా... చివర్లో డరైల్ మిచెల్ (18 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిని ప్రదర్శించాడు. అనంతరం భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది.
శివమ్ దూబే (23 బంతుల్లో 65; 3 ఫోర్లు, 7 సిక్స్లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. రింకూ సింగ్ (39; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. సిరీస్లో భారత్ 3–1తో ఆధిక్యంలో ఉండగా, చివరి పోరు శనివారం తిరువనంతపురంలో జరుగుతుంది.
ఓపెనర్ల దూకుడు...
అర్ష్ దీప్ వేసిన తొలి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి కివీస్ ఇన్నింగ్స్ను జోరుగా మొదలు పెట్టిన సీఫెర్ట్... హర్షిత్ వేసిన తర్వాతి ఓవర్లో సిక్స్, ఫోర్ బాదాడు. అతడి మరుసటి ఓవర్లో కూడా ఓపెనర్లిద్దరు కలిసి 15 పరుగులు రాబట్టగా... రవి బిష్ణోయ్ తొలి ఓవర్లో కాన్వే 2 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 71 పరుగులకు చేరింది. 25 బంతుల్లో సీఫెర్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అయితే శతక భాగస్వామ్యం తర్వాత కివీస్ 35 బంతుల వ్యవధిలో 37 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. గ్లెన్ ఫిలిప్స్ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) కొంత దూకుడుగా ఆడగా, చివరి 3 ఓవర్లలో 47 పరుగులు రాబట్టి న్యూజిలాండ్ మెరుగైన స్కోరును అందుకుంది. బుమ్రా వేసిన 19వ ఓవర్లో మిచెల్, హెన్రీ (6 నాటౌట్) కలిసి 2 ఫోర్లు, సిక్స్ సహా మొత్తం 19 పరుగులు సాధించారు.
దూబే సిక్సర్ల జోరు...
భారీ లక్ష్య ఛేదనలో అభిషేక్ శర్మ (0) ఇన్నింగ్స్ తొలి బంతికే వెనుదిరగ్గా... కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ (8) కూడా విఫలమయ్యాడు. సామ్సన్ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా భారీ స్కోరు చేయడంలో మళ్లీ విఫలం కాగా, హార్దిక్ పాండ్యా (2) ప్రభావం చూపలేదు. వరుసగా రెండు సిక్సర్లతో తన స్కోరును మొదలు పెట్టిన రింకూ ఆ తర్వాతా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు.
రింకూ అవుటైన తర్వాత దూబే మెరుపు షాట్లతో జట్టు విజయంపై ఆశలు రేపాడు. తొలి బంతికే సిక్స్తో ఖాతా తెరిచిన దూబే... సోధి ఓవర్లో వరుసగా 2, 4, (వైడ్), 6, 4, 6, 6 బాదడంతో మొత్తం 29 పరుగులు లభించాయి. డఫీ వేసిన తర్వాతి ఓవర్లో కూడా అతను మరో 2 సిక్స్లు కొట్టి 15 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
అయితే దురదృష్టవశాత్తూ అతను రనౌటయ్యాడు. 31 బంతుల్లో 71 పరుగులు చేయాల్సిన స్థితిలో హర్షిత్ కొట్టిన షాట్ బౌలర్ హెన్రీ చేతికి తగిలి నాన్స్ట్రయికింగ్ ఎండ్లో స్టంప్స్కు తగిలింది. దాంతో దూబే అవుట్ కావడంతో పాటు భారత్ గెలుపు ఆశలు ముగిశాయి.
4 రెండేళ్ల క్రితం టి20 ప్రపంచకప్ సాధించిన తర్వాత భారత జట్టు 40 అంతర్జాతీయ టి20 మ్యాచ్లు ఆడింది. కేవలం నాలుగుసార్లు మాత్రమే టీమిండియా ఆలౌటైంది. భారత్ను ఆలౌట్ చేసిన జట్లలో జింబాబ్వే, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఉన్నాయి.
2 అంతర్జాతీయ టి20ల్లో ‘గోల్డెన్ డక్’గా వెనుదిరగడం అభిషేక్ శర్మకిది రెండోసారి. ఈ భారత క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ (3 సార్లు) తొలి స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్, సంజు సామ్సన్, అభిషేక్ శర్మ (2 సార్లు చొప్పున) ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నారు.
3 అంతర్జాతీయ టి20ల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన మూడో భారతీయ బ్యాటర్గా శివమ్ దూబే (15 బంతుల్లో) నిలిచాడు. తొలి రెండు స్థానాల్లో యువరాజ్ సింగ్ (12 బంతుల్లో), అభిషేక్ శర్మ (14 బంతుల్లో) ఉన్నారు.
4 రింకూ సింగ్ ఈ మ్యాచ్లో ఫీల్డర్గా 4 క్యాచ్లు అందుకొని భారత్ తరఫున అత్యధిక క్యాచ్లు పట్టిన అజింక్య రహానే రికార్డు (4)ను సమం చేశాడు.
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) రింకూ (బి) కుల్దీప్ 44; సీఫెర్ట్ (సి) రింకూ (బి) అర్ష్ దీప్ 62; రచిన్ (సి అండ్ బి) బుమ్రా 2; ఫిలిప్స్ (సి) రింకూ (బి) కుల్దీప్ 24; చాప్మన్ (సి) హర్షిత్ (బి) బిష్ణోయ్ 9; మిచెల్ (నాటౌట్) 39; సాంట్నర్ (రనౌట్) 11; ఫోక్స్ (సి) రింకూ (బి) అర్ష్ దీప్ 13; హెన్రీ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–100, 2–103, 3–126, 4–137, 5–152, 6–163, 7–182. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–33–2, హర్షిత్ 4–0–54–0, బుమ్రా 4–0–38–1, రవి బిష్ణోయ్ 4–0–49–1, కుల్దీప్ యాదవ్ 4–0–39–2.
భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) కాన్వే (బి) హెన్రీ 0; సామ్సన్ (బి) సాంట్నర్ 24; సూర్యకుమార్ (సి అండ్ బి) డఫీ 8; రింకూ (ఎల్బీ) (బి) ఫోక్స్ 39; పాండ్యా (సి) ఫోక్స్ (బి) సాంట్నర్ 2; దూబే (రనౌట్) 65; హర్షిత్ (సి) రచిన్ (బి) సోధి 9; రవి బిష్ణోయ్ (నాటౌట్) 10; అర్ష్ దీప్ (సి) సాంట్నర్ (బి) సోధి 0; బుమ్రా (సి) సోధి (బి) సాంట్నర్ 4; కుల్దీప్ (సి) సీఫెర్ట్ (బి) డఫీ 1; ఎక్స్ట్రాలు 3; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 165. వికెట్ల పతనం: 1–0, 2–9, 3–55, 4–63, 5–82, 6–145, 7–157, 8–157, 9–162, 10–165. బౌలింగ్: హెన్రీ 3–0–24–1, డఫీ 3.4–0– 33–2, ఫోక్స్ 3–0–29–1, సోధి 4–0–46–2, సాంట్నర్ 4–0–26–3, ఫిలిప్స్ 1–0–7–0.


