టీమిండియా స్టార్ ఆటగాడు సంజూ శాంసన్ ఆల్రౌండర్ అభిషేక్ శర్మతో ఉన్న స్నేహ బంధాన్ని బయటపెట్టాడు. ఇండియా టుడే కాన్క్లేవ్ వేదికగా శాంసన్ అభిషేక్తో ఉన్న కెమిస్ట్రీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తమది నిప్పు-నీరు కాంబినేషన్ కాదని, ఇద్దరం నిప్పుకణికలమేణని శాంసన్ పేర్కొన్నాడు.
అభిషేక్ పట్ల భారత ఆటగాళ్లు అసూయ పడేవారని తెలిపాడు.‘మేమిద్దరం ఐస్ అండ్ ఫైర్ కాదు.. ఫైర్ అండ్ ఫైర్. ఒకసారి అభిషేక్ మెరిస్తే, మరోసారి నేను మెరుస్తాను. 2024 నుంచే మా కాంబినేషన్ అలా కొనసాగుతూ వస్తోంది. దీనికి తోడు కేరళ-పంజాబ్ ఫ్రెండ్షిప్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది.
మా మధ్య బంధం అంతా సహజంగా సాగిపోతుంది. దానిని కాంప్లికేట్ చేయదలచుకోలేదు. ఇక మైదానంలో మేమిద్దరం కలిసి బరిలోకి దిగినప్పుడు అభిషేక్ బంతి ఎలా వస్తుంది అని అడుగుతాడు. దానికి నేను సాధారణంగా వస్తుంది అని చెప్పడం, ఆ మరుసటి బంతిని అభిషేక్ సిక్స్ కొట్టడం జరిగిపోతాయి.
పెళ్లి చేసుకో భాయ్..
అభిషేక్ శర్మ చాలా ధైర్యవంతుడు, సమర్థుడు. మైదానం లోపల, వెలుపల అభిషేక్తో మంచి అనుబంధముంది. అయితే అభిషేక్ శర్మీ టీమిండియాకు ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో భారత ఆటగాళ్లే అతన్ని చూసి అసూయ పడేవారు. ఎందుకంటే అప్పట్లో ఎక్కడ చూసినా అభిషేక్.. అభిషేక్ అని వినిపిస్తుండేది. ఒకప్పుడు అభిషేక్ సాధారణ ఆటగాడు కావొచ్చు.. కానీ ఇప్పుడు అతనొక సూపర్స్టార్. అందుకే త్వరగా పెళ్లి చేసుకో బాయ్ అని సలహా ఇచ్చాను.’ అని పేర్కొన్నాడు.
ఇక టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా వచ్చి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. తొలి వికెట్కు 98 పరుగులు జోడించడంతో భారత్ 255 పరుగుల భారీ స్కోరు చేయడం, ఆపై న్యూజిలాండ్ 159 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 96 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్ను అందుకుంది.
ఇద్దరి కథ ఒకటే..
అయితే టీ20 ప్రపంచకప్ ఆరంభంలో ఇద్దరి కథ దాదాపు ఒకటే అని చెప్పొచ్చు. ఫామ్ కోల్పోయి అభిషేక్ శర్మ సతమతమవ్వగా, శాంసన్ కూడా అభిషేక్ స్థానంలో తొలుత వచ్చిన అవకాశాలను వృథా చేసుకోవడం జరిగింది. ఈ ఇద్దరు విఫలమైతున్నా కూడా జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారన్న విమర్శలు పెరిగిపోయాయి.
అయితే సూపర్-8లో వెస్టిండీస్తో మ్యాచ్లో ఫామ్ను అందుకున్న శాంసన్ దానిని ఫైనల్ వరకు అలాగే కొనసాగించి విమర్శకుల నోళ్లు మూయించాడు. మరోవైపు అభిషేక్పై నమ్మకంతో జట్టు మేనేజ్మెంట్ వరుసగా అవకాశాలు ఇస్తూనే వచ్చింది. చివరకు ఫైనల్లో అభిషేక్ శర్మ తన మార్క్ ఆటతో అలరించడమే గాక టీమిండియా టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.


