రష్మిక అదుర్స్‌ | Indias first win in the Billie Jean King Cup tournament | Sakshi
Sakshi News home page

రష్మిక అదుర్స్‌

Apr 10 2025 3:59 AM | Updated on Apr 10 2025 3:59 AM

Indias first win in the Billie Jean King Cup tournament

బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ టోర్నీలో భారత్‌కు తొలి విజయం

థాయ్‌లాండ్‌పై 2–1తో నెగ్గిన టీమిండియా  

పుణే: ప్రతిష్టాత్మక బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 మహిళల టీమ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత్‌ ఖాతాలో తొలి విజయం చేరింది. తొలి రోజు మంగళవారం న్యూజిలాండ్‌ చేతిలో 1–2తో ఓడిపోయిన భారత్‌ వెంటనే తేరుకుంది. బుధవారం థాయ్‌లాండ్‌ జట్టుతో జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 2–1తో గెలుపొందింది. భారత్‌కు తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక థాయ్‌లాండ్‌తో మ్యాచ్‌లోనూ శుభారంభం అందించింది. 

ప్రపంచ 170వ ర్యాంకర్‌ లానియానా తారారుడి (థాయ్‌లాండ్‌)తో జరిగిన తొలి సింగిల్స్‌లో ప్రపంచ 345వ ర్యాంకర్‌ రష్మిక 6–2, 6–4తో సంచలన విజయం సాధించింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక నాలుగు ఏస్‌లు సంధించింది. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. రెండో మ్యాచ్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో హైదరాబాద్‌ అమ్మాయి సహజ యామలపల్లి మూడో సెట్‌లో గాయం కారణంగా వైదొలిగింది. 

మనాన్‌చాయ (థాయ్‌లాండ్‌)తో జరిగిన మ్యాచ్‌లో సహజ తొలి సెట్‌ను 3–6తో కోల్పోయింది. రెండో సెట్‌ను టైబ్రేక్‌లో 7–6 (7/3)తో సొంతం చేసుకుంది. మూడో సెట్‌లో సహజ 0–1తో వెనుకబడిన దశలో గాయం కారణంగా ఆమె తప్పుకుంది. ఫలితంగా థాయ్‌లాండ్‌ స్కోరును 1–1తో సమం చేసింది. నిర్ణాయక మూడో మ్యాచ్‌లో అంకిత రైనా–ప్రార్థన తొంబారే ద్వయం సత్తా చాటుకుంది. పీంగ్‌టార్న్‌–పట్‌చారిన్‌ (థాయ్‌లాండ్‌) ద్వయంతో జరిగిన డబుల్స్‌ మ్యాచ్‌లో అంకిత–ప్రార్థన 7–6 (7/3), 3–6, 10–3తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో గెలిచి భారత్‌కు 2–1తో విజయాన్ని ఖరారు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement