లండన్: పురుషుల ప్రొ హాకీ లీగ్ టోర్నీలో భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టును మరోసారి చిత్తు చేసింది. శుక్రవారం జరిగిన తమ 15వ లీగ్ మ్యాచ్లో భారత జట్టు 7–1 గోల్స్ తేడాతో పాకిస్తాన్ జట్టుపై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున సుఖ్జీత్ సింగ్ (20వ ని.లో), హర్మన్ప్రీత్ సింగ్ (26వ ని.లో), హార్దిక్ సింగ్ (34వ ని.లో), జుగ్రాజ్ సింగ్ (35వ ని.లో), అభిషేక్ (41వ ని.లో), రాజ్కుమార్ పాల్ (44వ ని.లో), దిల్ప్రీత్ సింగ్ (54వ ని.లో) ఒక్కో గోల్ చేశారు.
పాకిస్తాన్ జట్టుకు అబూ మహమూద్ (13వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన తమ 14వ లీగ్ మ్యాచ్లో భారత జట్టు ‘షూటౌట్’లో 1–4తో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. భారత్, పాకిస్తాన్ జట్లు 15 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాయి. 17 పాయింట్లతో భారత్ 7వ స్థానంలో ఉండగా... ఆడిన 15 మ్యాచ్ల్లోనూ ఓడిన పాక్ చివరిదైన 9వ స్థానంలో కొనసాగుతోంది. భారత జట్టు తమ చివరి మ్యాచ్ను రేపు ఇంగ్లండ్తో ఆడుతుంది.


