
అర్జెంటీనా చేతిలో 3–4 గోల్స్తో ఓటమి
ప్రొ హాకీ లీగ్
అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో భారత పురుషుల జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. గత రెండు మ్యాచ్ల్లో నెదర్లాండ్స్ చేతిలో ఓడిన హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు... మూడో మ్యాచ్లో అర్జెంటీనా చేతిలో కూడా ఓడింది. యూరప్ అంచె పోటీల్లో భాగంగా బుధవారం జరిగిన పోరులో టీమిండియా 3–4 గోల్స్ తేడాతో అర్జెంటీనా చేతిలో పరాజయం పాలైంది. గత రెండు మ్యాచ్ల్లో పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచడంలో విఫలమైన భారత్... ఈసారి పేలవ డిఫెన్స్తో మూల్యం చెల్లించుకుంది.
భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ (12వ, 33వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా... అభిõÙక్ (42వ నిమిషంలో) ఒక గోల్ కొట్టాడు. అర్జెంటీనా తరఫున మాటియాస్ రే (3వ నిమిషంలో), లూకాస్ మార్టినేజ్ (17వ నిమిషంలో), శాంటియాగో టరాజొనా (34వ నిమిషంలో), లూకాస్ మెండెజ్ (46వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు.
భారత డిఫెండర్ల తప్పిదంతో ఆట ప్రారంభమైన మూడో నిమిషంలోనే కెప్టెన్ మాటియాస్ రే అర్జెంటీనా ఖాతా తెరిచాడు. హర్మన్ప్రీత్ గోల్తో టీమిండియా స్కోరు సమం చేసినా... మన రక్షణ పంక్తి పదే పదే తప్పిదాలకు పాల్పడటంతో అర్జెంటీనా దూకుడు పెంచగలిగింది. ఆఖర్లో పెనాల్టీ కార్నర్ రూపంలో స్కోరు సమం చేసే అవకాశం వచి్చనా... మనవాళ్లు దాన్ని గోల్గా మలచలేకపోయారు. గురువారం మరోసారి అర్జెంటీనాతో భారత్ తలపడనుంది.
భారత్కు రెండో విజయం
ఆంట్వర్ప్ (బెల్జియం): యూరోప్ పర్యటనలో భారత జూనియర్ మహిళల హాకీ జట్టు జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య బెల్జియంపై విజయం సాధించిన భారత అమ్మాయిలు... బుధవారం రెండో మ్యాచ్లో 2–1 గోల్స్ తేడాతో మరో సారి బెల్జియంపై గెలుపొందారు. భారత్ తరఫున లాల్థాట్లుయాంగి (35వ నిమిషంలో), గీతా యాదవ్ (50వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. బెల్జియం తరఫున్ వాన్ హెల్మోంట్ (48వ నిమిషంలో) ఏకైక గోల్ చేసింది. ఈ పర్యటనలో గురువారం భారత్ జట్టు చివరి మ్యాచ్ ఆడనుంది.