
బెర్లిన్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ నుంచి భారత మహిళల జట్టు ని్రష్కమించింది. ఆదివారం 2024–2025 సీజన్ ముగిసింది. చివరిదైన యూరోపియన్ అంచె పోటీల్లో ఆడిన అన్ని మ్యాచ్లు ఓడిపోయిన భారత్ చివరిదైన తొమ్మిదో స్థానంలో నిలిచి ప్రొ లీగ్ నుంచి అవుటైంది. చైనాతో జరిగిన ఆఖరి మ్యాచ్లో భారత్ 2–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత జట్టుకు సునెలితా టొప్పో (9వ నిమిషంలో), రుతుజా (38వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. చైనా నుంచి జంగ్ ఇంగ్ (19వ, 39 నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... జు వెన్ యు (53వ నిమిషంలో) ఒక గోల్ సాధించింది.
నిజానికి శనివారం చైనాతో జరిగిన తొలి మ్యాచ్ ఓటమితోనే ప్రొ లీగ్ బెర్త్ గల్లంతయ్యింది. అయితే అసాధ్యమైన భారీ గోల్స్ తేడాతో పేపర్లో ఉన్న అవకాశం తాజా పరాజయంతో దూరమైంది. తొమ్మిది జట్లు పోటీపడిన ఈ లీగ్లో భారత్ 16 మ్యాచ్లాడి 10 పాయింట్లతో అట్టడుగున నిలిచింది. ఇలా ఆఖరి స్థానంలో నిలిచిన జట్టు ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ నుంచి అనర్హతకు గురవుతుంది. మళ్లీ లీగ్లోకి అర్హత సంపాదించాలంటే వచ్చే ఏడాది ఎఫ్ఐహెచ్ నేషన్స్ కప్లో ఆడిన అందులో మెరుగైన స్థానం సాధిస్తేనే ప్రొ లీగ్ బెర్త్ లభిస్తుంది.