PC: BCCI X
శ్రీలంకతో రెండో టెస్టు నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ జరుగుతోంది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తప్పించి.. అతడి స్థానంలో సారాంశ్ జైన్ను ఆడించాలని పలువురు మాజీ క్రికెటర్లు యాజమాన్యానికి సూచిస్తున్నారు. మ్యాచ్ వేదికైన కొలంబోలో ఆఫ్ స్పిన్నర్ అవసరం ఉంటుంది గనుక సారాంశ్ను ఆడించడమే ఉత్తమమని మహ్మద్ కైఫ్ వంటి మాజీ ప్లేయర్లు అభిప్రాయపడుతున్నారు.
అతడొక మ్యాచ్ విన్నర్
ఈ నేపథ్యంలో భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే మాత్రం కుల్దీప్ యాదవ్కు అండగా నిలిచాడు. ‘అతడు చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. గాలేలోని పరిస్థితుల నేపథ్యంలో అతడి బాధ్యతలు వేరేవి. నా దృష్టిలో అతడొక మ్యాచ్ విన్నర్.
మా ప్రణాళికల్లో అతడు కీలకం. ఒక్క మ్యాచ్ ద్వారానే అతడి ప్రతిభను అంచనా వేయడం సరైంది కాదు’ అని పేర్కొన్నాడు. కాగా గాలే వేదికగా జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 25 ఓవర్లు వేసిన కుల్దీప్ యాదవ్... 103 పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ మాత్రమే తీశాడు.
అదరగొట్టిన మానవ్
మరోవైపు.. కెరీర్లో రెండో టెస్టు మ్యాచ్ ఆడిన మానవ్ సుతార్ ఏకంగా 10 వికెట్లు పడగొట్టగా... సీనియర్ రవీంద్ర జడేజా పొదుపుగా బౌలింగ్ చేస్తూ 4 వికెట్లు తీశాడు. నిజానికి శ్రీలంక స్పిన్నర్లు కూడా బంతిని గింగిరాలు తిప్పిన చోట కుల్దీప్ యాదవ్ ప్రభావం చూపలేకపోవడం గమనార్హం. ఫలితంగా ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి.
ప్రాక్టీస్ కూడా చేయలేదు.. రెండో టెస్టుకు డౌటే!
ఇదిలా ఉంటే.. రెండో టెస్టు కోసం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కుల్దీప్ యాదవ్ మైదానానికి వచ్చినప్పటికీ.. ప్రాక్టీస్ చేయకుండానే వెనుదిరిగాడు. అటు బౌలింగ్ కానీ.. ఇటు బ్యాటింగ్ కానీ ప్రాక్టీస్ చేయలేదు.
మరోవైపు.. సారాంశ్ జైన్ కొన్ని ఓవర్ల పాటు బౌలింగ్ ప్రాక్టీస్ చేవాడు. ఈ నేథ్యంలో బహుతులే మాత్రం.. కుల్దీప్ విశ్రాంతి తీసుకుంటున్నాడని.. అందుకే ప్రాక్టీస్ చేయలేదని తెలపడం విశేషం. ఏదైమైనా కుల్దీప్నకు కోచ్ అండగా నిలిచినప్పటికీ.. కొలంబో పిచ్ పరిస్థితుల కారణంగా అతడిపై వేటు తప్పదనే సంకేతాలు ఇచ్చినట్లు అయింది.
అతడి ప్రణాళికలు స్పష్టంగా ఉంటాయి
ఇదిలా ఉంటే.. గాలె టస్టులో ఇక తొలి టెస్టులో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేసుకున్న యువ స్పిన్నర్ మానవ్ సుతార్పై బహుతులే ప్రశంసలు కురిపించాడు. ‘దేశవాళీల నుంచి సుతార్ను గమనిస్తున్నా. అతడు చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. విభిన్న పరిస్థితుల్లో ఎలా రాణించాలో సుతార్కు బాగా తెలుసు.
ఎలాంటి పిచ్పై ఎలాంటి బంతులు వేసి ఫలితం రాబట్టాలి... ఏ బ్యాటర్కు ఎలాంటి ఫీల్డ్ ప్లేస్మెంట్తో బౌలింగ్ చేయాలి... ఇలా అతడి ప్రణాళికలు చాలా స్పష్టంగా ఉంటాయి. దీంతో అతడు జట్టుకు అదనపు బలంగా మారాడు’ సాయిరాజ్ బహుతులే వెల్లడించాడు.
కాగా శ్రీలంక- టీమిండియా మధ్య ఆదివారం (ఆగష్టు 23) నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇందుకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదిక.


