Prithvi Shaw: పృథ్వీ షాకు నో ఛాన్స్‌! ఓపెనర్లుగా గిల్‌- ఇషాన్‌ జోడీనే.. ఎందుకంటే..

Ind Vs NZ: Prithvi Will Still Have To Wait Says Aakash Chopra Why - Sakshi

India vs New Zealand, 3rd T20I: టీమిండియా తరఫున బరిలోకి దిగేందుకు యువ ఓపెనర్‌ పృథ్వీ షా ఇంకొన్నాళ్లు వేచిచూడక తప్పదని భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. న్యూజిలాండ్‌తో మూడో టీ20 సందర్భంగా ఈ విధ్వంసకర బ్యాటర్‌ రీఎంట్రీ సాధ్యం కాకపోవచ్చని అంచనా వేశాడు. ఇషాన్‌- గిల్‌ జోడీనే మరోసారి ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు.

కాగా గత కొన్నాళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపుతున్న ముంబై బ్యాటర్‌ పృథ్వీ షా చాలా కాలం తర్వాత కివీస్‌తో టీ20 సిరీస్‌ నేపథ్యంలో భారత జట్టుకు ఎంపికయ్యాడు. రంజీల్లో రికార్డులు సృష్టించిన ఈ సంచలన ఆటగాడిని ఎట్టకేలకు సెలక్టర్లు కరుణించడంతో తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.

టీ20లలో వాళ్లు విఫలమైనా
అయితే, పృథ్వీ సమకాలీన క్రికెటర్లు వన్డేల్లో డబుల్‌ సెంచరీలతో చెలరేగిన శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌.. టీ20లలో సీనియర్ల గైర్హాజరీలో ఓపెనింగ్‌ చేస్తున్నారు. న్యూజిలాండ్‌తో తొలి రెండు టీ20లలో మాత్రం పూర్తిగా తేలిపోయారు.

గిల్‌ వరుసగా 7, 11 పరుగులు చేయగా ఇషాన్‌ 4, 19 రన్స్‌ మాత్రమే చేశాడు. వీరిద్దరు విఫలమైన నేపథ్యంలో ఆఖరి టీ20లలోనైనా పృథ్వీకి అవకాశం ఇస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా మాత్రం.. ఇందుకు భిన్నంగా పృథ్వీకి ఇప్పుడు అవకాశం ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డాడు. 

పృథ్వీని ఆడించొద్దు.. ఎందుకంటే
ఇందుకు గల కారణాలను తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా విశ్లేషిస్తూ.. ‘‘నాకు తెలిసి ఇషాన్‌ కిషన్‌- శుబ్‌మన్‌ గిల్‌ జోడీ కొనసాగుతుంది. పృథ్వీ షా వేచిచూడాల్సిందే! అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి పృథ్వీ షాను ఆడించారనుకోండి.. అతడు రన్స్‌ స్కోరు చేయొచ్చు లేదంటే విఫలం కావొచ్చు.

ఒకవేళ అనుకున్నట్లు రాణిస్తే బాగుంటుంది. లేదంటే పరిస్థితి ఏంటి? ఒకవేళ నిజంగానే పృథ్వీ రాణించకపోతే.. ఒక్క మ్యాచ్‌ను బట్టి అతడి ఆట తీరును జడ్జ్‌ చేస్తారా? ఒకే ఒక్క మ్యాచ్‌లో.. అది కూడా సిరీస్‌లో ఆఖరిదైన నిర్ణయాత్మక టీ20లో అవకాశం ఇచ్చి పరీక్ష పెట్టం సరికాదు.

వాళ్లకు మరిన్ని ఛాన్స్‌లు
అంతేకాదు.. గిల్‌- కిషన్‌ జోడీని కూడా ఇప్పుడే విడదీయడం కరెక్ట్‌ కాదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. తమను తాము నిరూపించుకుంటే వాళ్లు దీర్ఘకాలం ఆడగలుగుతారు. లేదంటే లేదు’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా- న్యూజిలాండ్‌ మధ్య టీ20 సిరీస్‌ విజేతను తేల్చే బుధవారం నాటి మూడో టీ20కి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.

చదవండి: Ind Vs NZ: ఏదైతేనేం.. హార్దిక్‌ అలా! సూర్య ఇలా!... ఎన్నో మార్పులు.. భావోద్వేగానికి లోనైన ‘స్కై’
Virushka With Vamika: ప్రకృతి ఒడిలో.. వామికాను ఆటలాడిస్తూ.. విరుష్క ఫొటోలు వైరల్‌
పృథ్వీ షా చేతికి మైక్‌ ఇచ్చిన ద్రవిడ్‌.. నవ్వాపుకొన్న గిల్‌! వీడియో చూశారా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top