
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా ఇంగ్లండ్తో (England) ఇవాళ (ఫిబ్రవరి 26) జరుగుతున్న కీలక సమరంలో ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran) సూపర్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్లో జద్రాన్ 106 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 35 మ్యాచ్ల వన్డే కెరీర్లో జద్రాన్కు ఇది ఆరో శతకం.
ఈ సెంచరీతో జద్రాన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్కప్లో, ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ చేసిన తొలి ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. జద్రాన్ 2023 వన్డే వరల్డ్కప్లో ఆస్ట్రేలియాపై సూపర్ సెంచరీతో మెరిశాడు. ముంబైలో జరిగిన ఆ మ్యాచ్లో జద్రాన్ 129 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్.. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ధాటికి 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆర్చర్.. 11 పరుగుల వద్ద గుర్భాజ్ను (6), 15 పరుగుల వద్ద సెదికుల్లా అటల్ను (4).. 37 పరుగుల వద్ద రహ్మత్ షాను (4) ఔట్ చేశాడు.
ఈ దశలో జద్రాన్.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది నాలుగో వికెట్కు 103 పరుగులు జోడించి ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్కు జీవం పోశారు. హష్మతుల్లా 40 పరుగులు చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్లో ఔటయ్యాడు. అనంతరం జద్రాన్..అజ్మతుల్లా ఒమర్జాయ్ సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
31 బంతుల్లో బౌండరీ, మూడు సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేసిన అనంతరం అజ్మతుల్లా జేమీ ఓవర్టన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 42 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 227 పరుగులుగా ఉంది. జద్రాన్తో (115) పాటు మహ్మద్ నబీ (8) క్రీజ్లో ఉన్నారు.
కాగా, గ్రూప్-బిలో ఈ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్గా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సెమీస్ రేసులో నిలుస్తుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ తమ తొలి మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓడిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య నిన్న జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ప్రస్తుతం గ్రూప్-బి పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలో 3 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ ఖాతా తెరవకుండా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు ఇదివరకే సెమీస్ బెర్త్లు ఖరారు చేసుకున్నాయి. ఆతిథ్య పాకిస్తాన్, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.